రెండ్రోజుల్లో చంద్రబాబు-పవన్ భేటీ! టీడీపీ-జనసేన సీట్లపై ప్రకటన?
ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కు సమయం దగ్గరపడుతోంది. ఓవైపు అధికార వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులతో అభ్యర్ధుల్ని రెడీ చేసేస్తోంది. అదే సమయంలో వైసీపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన టీడీపీ-జనసేనలో మాత్రం ఆ ఊపు కనిపించడం లేదు. సంక్రాంతికే సీట్ల పంపకాలు పూర్తి చేసి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేస్తామని చెప్పినా అది సాధ్యం కాలేదు. అంతే కాదు ఆ తర్వాత చంద్రబాబు ఏకపక్షంగా మండపేటలో పోటీ చేస్తామని చేసిన ప్రకటనతో గ్యాప్ పెరిగింది.
దీంతో రిపబ్లిక్ డే రోజు అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ .. తాము కూడా రాజోలు, రాజానగరం సీట్లలో పోటీ చేస్తామనే పోటీ ప్రకటన చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఉన్న గ్యాప్ బయటపడింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజులుగా గుంభనంగా ఉంటున్న ఇరు పార్టీల అధినేతలు.. ఇప్పుడు మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల్లో వీరిద్దరి భేటీ ఉండే అవకాశం ఉంది. ఇరు పార్టీలు పోటీ చేసే స్ధానాలపై ఇప్పటికే పలు చోట్ల క్లారిటీ వచ్చేసినా ఇంకొన్ని స్ధానాలపై మాత్రం ఫైనల్ చర్చలు జరగాల్సి ఉంది.

దీంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ అయి సీట్ల పంపకాలపై తుది చర్చలు పూర్తి చేయబోతున్నారు. అనంతరం ఫిబ్రవరి మొదటివారంలో టీడీపీ, జనసేన పోటీ చేసే సీట్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటన చేయబోతున్నారు. అనంతరం ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా ఖరారు చేసి విడుదల చేసే అవకాశం ఉంది. ఆలోపు క్షేత్రస్ధాయిలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో చంద్రబాబు, పవన్ భేటీలో వీటిపైనా చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications