చంద్రబాబు, ఫ్యామిలీ ఆస్తులు ఇవే: మెట్రోపై కామెంట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తన ఆస్తులను, తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆస్తుల వివరాలను వెల్లడించారు. గత నాలుగేళ్ల నుంచి వరుసగా తన కుటుంబ ఆస్తులను ప్రకటిస్తున్నానని, ఎథిక్స్ కమిటీకి తన కుటుంబ ఆస్తుల వివరాలను సమర్పిస్తున్నానని చెప్పారు.
నిరుటితో పోలిస్తే తన బ్యాంక్ బ్యాలెన్స్ కొద్దిగా పెరిగిందని, తన భార్య భువనేశ్వరి ఆస్తుల్లో కూడా పెద్ద తేడా లేదని, అయితే ఫ్రావిడెంట్ ఫండ్, బంగారం పెరిగిందని ఆయన తెలిపారు. తన కుమారుడు లోకేష్ నాయుడు ఆస్తి కొంత మేర తగ్గిందని అన్నారు. నిర్వహణ హోల్డింగ్ ఆస్తులు రూ. 90 లక్షల పెరిగాయని చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో ఉన్న తన ఇంటి విలువ రూ.23.2 లక్షల రూపాయలని చంద్రబాబు చెప్పారు.
కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి - చంద్రబాబు నాయుడు ఆస్తులు : రూ. 70.69 లక్షలు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఆస్తులు : రూ. 30.59 కోట్లు, కుమారుడు నారా లోకేష్ ఆస్తులు: రూ. 3.57 కోట్లు, కోడలు బ్రహ్మణి ఆస్తులు : రూ. 39.50 కోట్లు.
హెరిటేజ్ ఫుడ్ టర్నోవర్ రూ. 1.722 కోట్లని, హెరిటేజ్కు 15 లక్షల మంది వినియోగదారులు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. కార్పొరేట్ నిబంధనలకు అనుగుణంగా హెరిటేజ్ నడుస్తుందని ఆయన చెప్పారు. హెరిటేజ్లో 7,320 మంది ఉద్యోగులు ఉన్నారని, అందులో 14 వేల మంది పరోక్ష ఉద్యోగులు ఉన్నారని, ఎక్కడా చిన్న అవకతవకలు లేకుండా పని చేస్తున్నారని ఆయన చెప్పారు.
హైదరాబాద్ మెట్రో చిక్కుల్లో పడటం బాధగా ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ మెట్రో కోసం నేను కృషి చేశారని, ఎన్డీయే హయాంలో అప్పటి ప్రధాని వాజ్పేయ్తో మాట్లాడి ప్రాజెక్టు తీసుకువచ్చానని ఆయన అన్నారు. మెట్రో రైల్ కన్సాల్టెంట్గా శ్రీధరన్ను పెట్టి పని మొదలు పెట్టామనిస ఈలోగా ప్రభుత్వం మారిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారని, శ్రీధరన్ మారిపోయారని, అప్పటి నుంచి అన్నీ అక్రమాలే జరిగాయని చంద్రబాబు అన్నారు.
అనవసరంగా తన పేరు వివాదంలోకి లాగుతున్నారని, ప్రభుత్వం, ఎల్ అండ్ టీ చర్చించుకుని సమస్య పరిష్కరించుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఎల్ అండ్ టీ మంచి ప్రొఫెసనల్ కంపెనీ అనీ ఆయన కితాబిచ్చారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ నుంచి గానీ, మరే ఇతర పార్టీల నుంచి నేర్చుకునే స్థితిలో లేమని, ఒక పద్ధతి, నిబద్ధతతో ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.