రుషికొండపై తేల్చేసిన చంద్రబాబు-త్వరలో జనానికి ఎంట్రీ..!
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ విశాఖలోని రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. కూటమి పార్టీలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర నేతలతో కలిసి రుషికొండ ప్యాలెస్ లో అణువణువూ పరిశీలించారు. అధికారులను అడిగి అందులో నిర్మాణాలు, వాటిలో వాడిన సామాగ్రి వివరాలు తెలుసుకున్నారు. వీటిని త్వరలో ప్రజలకు బయటపెడతామని, అలాగే జనం సందర్శనకు కూడా అనుమతిస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయా అనేలా ఈ వ్యవహారం జరిగిందని చంద్రబాబు తెలిపారు. ఓ వ్యక్తి విలాసవంతమైన జీవనం కోసం ఇలాంటి పనులు చేస్తాడని ఎవరూ కలలో కూడా ఊహించలేమని తెలిపారు. గుండె చెదిరిపోయే నిజాలు బయటికి వస్తున్నాయన్నారు. ఇంత నేరాలు చేయాలంటే అన్నింటికి తెగించాలన్నారు. ప్రజాస్వామ్యం చాలా బలమైనదన్నారు.

ఇదే ప్రదేశంలో ఇలాంటివి జరుగుతున్నాయని బయటి ప్రపంచం కోడై కూస్తున్నా వాస్తవాలు రిపోర్ట్ చేయాలని మీడియా, పర్యావరణం ప్రమాదంలో పడిందని పర్యావరణ వేత్తలు రావాలని ప్రయత్నించినా దరిదాపుల్లోకి రాలేకపోయారన్నారు. ఎన్జీటీ, హైకోర్టుకు వెళ్లారన్నారు. గతంలో తాను, పవన్, బీజేపీ నేతలు ప్రయత్నించినా రుషికొండకు రాలేకపోయినట్లు తెలిపారు.
గతంలో ప్రజాస్వామ్యం ఆశ్చర్యపోయే విధంగా రుషికొండలో అరాచకాలు జరిగాయో, అలాంటి ప్రజాస్వామ్యమే మళ్లీ ఇలాంటి పరిస్ధితులు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చిందన్నారు.
తాను చాలాదేశాలు తిరిగానని, చాలామంది వ్యక్తుల్ని చూశానని, కానీ పర్యావరణ విధ్వంసం చేసి సీఎం నివాసం కట్టుకోవడం ఎక్కడా చూడలేదన్నారు. ఒకప్పుడు చంద్రగిరి, విజయనగరం, మైసూరు ప్యాలెస్ లు చూశామని, అవి చరిత్రలో నిలిచిపోయాయన్నారు. అలాంటి ప్యాలెస్ మళ్లీ కట్టుకోవాలని ఎవరూ ప్రయత్నించలేదన్నారు. ఈ సందర్భంగా ఒక్కో బ్లాక్ లో ఏమేం ఉన్నాయో చంద్రబాబు వివరించారు. వీటిపై విచారణ చేస్తే ఎంతోమంది ఎగిరిపోతారన్నారు.
మరోసారి జగన్ ను ఎస్కోబార్ తో పోల్చిన చంద్రబాబు.. ఆయనపై తనకేం కోపం లేదన్నారు. రుషికొండ ప్యాలెస్ వీడియో తీసి ప్రజలకు అన్ని వివరాలు అందిస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రజల్లో దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తర్వాత ప్రజలకు రుషికొండ ప్యాలెస్ లోకి అనుమతిస్తామన్నారు. తర్వాతి దశలో ఈ ప్యాలెస్ ను ఏం చేయాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications