చంద్రబాబుకు మీరే గడ్డి పెట్టండి: జగన్, వైసిపి ఎమ్మెల్యే జోగి అరెస్ట్
అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం ధర్మవరంలో చేనేత కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబుకు మీరే గడ్డి పెట్టాలన్నారు.
ధర్మవరంలో, పింఛన్లు ఇచ్చేది తక్కువమందికి, కట్ చేసేది ఎక్కువ మందికి అన్నారు. చంద్రబాబు పరిపాలన అంతా మోసం, దగా అన్నారు. చేనేత రుణాలు మాఫీ చేస్తానని చేయలేదని, ఇళ్లు కట్టిస్తానని ఇవ్వలేదన్నారు. నేతన్నలకు ఆరు లక్షల రూపాయల రుణం ఇస్తానని కూడా ఇవ్వలేదన్నారు.
చంద్రబాబు తాను ఇచ్చిన హామీలలో ఒక్కదానిని కూడా అమలు చేయలేదన్నారు. చేనేత కార్మికుల పరిస్థితి దుర్భలంగా ఉందన్నారు. మీకు ఇచ్చిన ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని, కాబట్టి ఆయనకు బుద్ధి వచ్చేలా మీరే గడ్డి పెట్టాలని జగన్ చేనేత కార్మికులకు సూచించారు.
ధర్మవరంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 16 మంది చేనేత కార్మికులు చనిపోయారని, ఇప్పటి దాకా ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. జాబు రావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారని, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు పోతున్నాయన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదన్నారు.
వేలి ముద్రలు సరిపోడం లేదని రేషన్ బియ్యం కూడా ఇవ్వడం లేదన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం లేదని చెప్పారు. చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగా ఉందని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసిపి ఎమ్మెల్యే జోగి రమేష్ అరెస్ట్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు జోగి రమేష్ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాలో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఆయనను అరెస్టు చేసిన పోలీసులు అగిరిపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు.