ఆ రోజు ఎగతాళి చేశారు, అన్ని విధాలుగా అవమానించారు: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగినప్పుడు సమన్యాయం కావాలంటే అదెక్కడుంటుందని తనను ఎగతాళి చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఆయన మంగళవారం శాసనసభలో ప్రకటన చేశారు. విభజన విషయంలో అన్ని విధాలుగా అవమానించారని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి విభజన చట్టాన్ని ఆమోదించారని, విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెసు పార్టీని చిత్తుగా ఓడించారని ఆయన అన్నారు. దాన్ని బట్టి విభజనపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని, హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనలో హేతుబద్దత లేదని, పద్ధతి లేకుండా ఇష్టానుసారం చేశారని ఆయన విమర్శించారు. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోలేదని, భాగస్వాములను విశ్వాసంలోకి తీసుకోలేదని, అందరికీ న్యాయం జరిగేలా విభజన చేయలేదని ఆయన అన్నారు. చరిత్రలో మొదటిసారి ఆర్టికల్ 3ని ప్రయోగించి రాష్ట్రాన్ని విభజించారని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాలు కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారనీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే తెలంగాణ ప్రజలను ఒప్పించాలనీ విభజించాలని అనుకుంటే సీమాంధ్ర ప్రజలను ఒప్పించాలని తాను చెప్పానని, తన మాటను వినలేదని ఆయన అన్నారు.
తమకు రాజధాని లేదని, మెగాసిటీలు ఉంటేనే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు. రాజధాని ఉన్న ప్రాంతం విభజనను కోరుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రసంగానికి ప్రతిపక్ష నేత జగన్ అభ్యంతరం తెలిపారు. నోట్లో ఉంది వేరు, చంద్రబాబు మాట్లాడుతున్నది వేరని ఆయన అన్నారు.
జగన్ అభ్యంతరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఉత్తరాంచల్, హిమచల్ ప్రదేశ్లకు ఇచ్చినట్లు తమకు ఇవ్వాలని తాము కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక హోదానే కాకుండా చట్టంలో ఉన్నవాటిని అన్నింటినీ సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
వార్ రూం పెట్టి రాష్ట్ర విభజన చేశారని, వార్ రూం కాదు.. పీస్ రూం కావాలని తాను ఆ రోజు అంటే పట్టించుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి రావాల్సినవి ఏమిటో ఆయన తెలియజేశారు. 59 శాతం జనాభా రాజధానిని విడిచి పెట్టి వెళ్లడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. రెవెన్యూ లోటు రూ.2 వేల 300 కోట్లు ఇ్చచారని, ఇంకా రూ. 12 వేల కోట్ల రూపాయలు రావాలని ఆయన అన్నారు. 59 శాతం జనాభాకు 47 శాతం ఆదాయం మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు.
పోలవరం ముంపు గ్రామాలను ఎపిలో కలపకపోతే ఆ ప్రాజెక్టు కలగానే మిగిలిపోయి ఉండేదని, తన ప్రయత్నంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ గ్రామాలను ఎపిలో కలిపిందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన చెప్పారు.