గూగుల్లా ఏపీ: బాబు, సత్య నాదేళ్ల, వెంకటేశ్వరునిపై..
విశాఖపట్నం: గూగుల్ ఎలా అభివృద్ధి చెందిందో ఏపీ అంతే వేగంగా అభివృద్ధి చెందుతుందని, తమకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు ఉన్నాడని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖలో అన్నారు. సీఈవోల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. వేంకటేశ్వరుడికి 8500 కోట్ల డిపాజిట్లు, 5 వేల కిలోల బంగారం ఉందని చంద్రబాబు చెప్పారు. భారత్ ఇక నిద్రపోతున్న సింహం కాదని, ఇక గర్జిస్తుందని అన్నారు.
విశాఖ అద్భుతమైన నగరమన్నారు. తూర్పు కోస్తాలో ఉత్తమమైన నగరం విశాఖ అన్నారు. ప్రతి ఒక్కరు ఈ నగరాన్ని ఒక్కసారి చూస్తే జీవితకాలం ప్రేమిస్తారన్నారు. మేక్ ఇన్ ఇండియాలాగా మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని చెప్పారు. విద్యార్థులు తరగతి గదులకు పరిమితం కాకుండా వినూత్నంగా ఆలోచించాలన్నారు. ఆంధ్రా ప్రాంత వృత్తి నిపుణులు ప్రపంచంలోని ప్రతి దేశంలో.. ప్రతి ప్రాంతంలో ఉన్నారన్నారు. 30 ఏళ్లలో ఇన్ఫోసిస్ సాధించిన విజయం గొప్ప పాఠమన్నారు.
గూగుల్ ఎలా అభివృద్ధి చెందిందో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ త్వరలో డిజిటల్ ఏపీగా మారుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశామన్నారు. హైదరాబాదు అభివృద్ధికి తొమ్మిదేళ్లు తీసుకున్నామని, విశాఖ మూడు నాలుగేళ్లలో అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ నగరాన్ని సిలికాన్ కారిడార్గా అభివృద్ధి చేస్తామన్నారు.
ఐటీకి సింబల్గా హైదరాబాదులో హైటెక్ సిటీ నిర్మించామని, ఐటికీ సింబల్గా విశాఖలో సిగ్నేచర్ టవర్స్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నుండి రూ.65వేల కోట్ల ఐటీ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయంటే వాటికి పునాది వేసింది తామే అన్నారు. ముంబై తరహాలో విశాఖలో ఎన్నో అనుకూలతలు ఉన్నాయన్నారు. తూర్పు తీరంలో చెన్నై, కోల్కతా తర్వాత అతిపెద్ద తీరం విశాఖ అన్నారు. ముంబైలా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు.
స్వయం సహాయక మహిళలకు ఐపాడ్లు ఇస్తామన్నారు. మాకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు ఉన్నాడన్నారు. ఎన్నో ఆస్తులతో వెంకటేశ్వర స్వామి తులతూగుతున్నారన్నారు. 2029 నాటికి ఏపీని భారత్లో నెంబర్ వన్గా చేస్తామన్నారు. ఏపీలో విద్యుత్ సమస్య లేకపోవడానికి ఆనాడు తాము తీసుకున్న చర్యలే కారణమన్నారు. తాము చేపట్టిన సంస్కరణల వల్లనే విద్యుత్ రంగంలో అభివృద్ధి సాధించగలిగామన్నారు.
ఏపీలో అతి త్వరలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. స్వచ్ఛ భారత్, ధన్ జన్ యోజన పథకాలు రెండు చాలా ఉత్తమమైనవని ప్రశంసించారు. సంక్షోభాలను సమర్థంతంగా ఎదుర్కొని, అవకాశాలుగా మార్చుకుంటామని తెలిపారు. ఏపీలో తగినన్ని ఖనిజ నిల్వలు, నీరు ఉన్నాయన్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో నాదెళ్ల సత్య అనంతపురం రాష్ట్రానికి చెందిన వ్యక్తి అన్నారు.