మీకోసం తొలిసారి జైలుకెళ్లా, కెసిఆర్ను పంపిస్తా: బాబు
కరీంనగర్/నిజామాబాద్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును తాను శాశ్వతంగా జైలుకు పంపిస్తానని, తన జీవితంలో ఎప్పుడు జైలుకు పోలేదని, బాబ్లీ పైన నిరసన తెలియజేసి.. మొదటిసారి తెలంగాణ ప్రజల కోసం జైలులో ఉన్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం అన్నారు. గోదావరి పైన 14 ప్రాజెక్టులు అక్రమంగా కడుతున్నారని, బాబ్లీపై మహారాష్ట్ర, ఢిల్లీ, శ్రీరాం సాగర్ వద్ద ఆందోళన చేశామన్నారు.
బాబ్లీ పైన కెసిఆర్ ఎందుకు పోరాటం చేయలేదని ప్రశ్నించారు. శ్రీరాం సాగర్కు నీళ్లు రాకపోతే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందన్నారు. దానికి తాను ఒప్పుకోనని, స్పష్టం చేసి జైలులో పెట్టినా ఫర్వాలేదంటూ తెలంగాణ ప్రజల కోసం పోరాడానన్నారు. కెసిఆర్ను శాశ్వతంగా జైల్లో పెట్టిస్తానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు.
తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లో టిడిపి, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రానుందన్నారు. నీ అక్రమాలను బయటపెట్టి నిన్ను, నీతోపాటు నీ కుటుంబాన్ని జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. తన జోలికి వస్తే సైకిల్ స్పీడు పెంచి తొక్కించేస్తానని, జనం జోలికొస్తే తాటతీస్తానని చంద్రబాబు అన్నారు. కెసిఆర్కు నాగుపాము కన్నా ఎక్కువ విషం ఉందని, అది ప్రజల్లోకి ఎక్కిస్తున్నారని, విద్వేషాలను రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు.
కెసిఆర్ వలస పక్షి అని, ఒక్కో ఎన్నికల్లో ఒక్కో జిల్లాకు మారుతాడని ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎంపీగా పని చేసిన కెసిఆర్ ఇక్కడే ఉండి అభివృద్ధి చేస్తానని చెప్పి అభివృద్ధిని మరిచారన్నారు. ఇక్కడి నుంచి మహబూబ్నగర్కు వెళ్లి అక్కడేమి చేయలేదన్నారు. ఇప్పుడు కొత్తగా మెదక్ నుంచి పోటీ చేస్తున్నాడని బాబు విమర్శించారు. కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని దుయ్యబట్టారు. తెలంగాణ అమరవీరుల ఆత్మబలిదానాల ఫలితంగా వచ్చిందే తప్ప మరొకరి వల్ల కాదన్నారు.
కెవిపి దొంగలకు దొంగ అని బాబు విమర్శించారు. కెవిపిని అరెస్టు చేయకుండా కాంగ్రెస్ మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నేతృత్వంలోని సోనియా గాంధీ పదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని సవాల్ విసిరారు. తెరాసకు ఓట్లేస్తే కెసిఆర్ కుటుంబం బాగుపడుతుందని, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశం సమాజం బాగుపడుతుందన్నారు. ఆయనకు అధికారమిస్తే 30 ఏళ్లయినా విద్యుత్తు రాదని విమర్శించారు.