చంద్రబాబు చాయ్ పే చర్చ- బాపట్ల టీకొట్లో స్ధానికులతో కలిసి టీ తాగుతూ..!
టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు ఎన్నికల కోసం రంగం సిద్దం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించేందుకు వ్యూహరచన చేస్తున్న చంద్రబాబు ఇప్పటికే జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు. అంతే కాదు ప్రచార శైలిలోనూ పలు మార్పులు చేసుకుంటున్నారు. తాజాగా బాపట్ల పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన ప్రచారం ఆకట్టుకుంది.
బాపట్ల నియోజకవర్గం అప్పికట్లలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు .. అక్కడ స్ధానికంగా ఉన్న ఓ టీ స్టాల్ కు వెళ్లారు. రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ తన వాహనం ఆపి మరీ టీ స్టాల్ కు వెళ్లిన చంద్రబాబు..అక్కడే ఉన్న కొందరు స్ధానికులతో మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. చాయ్ పే చర్చా తరహాలో కాసేపు వారితో ముచ్చటించిన చంద్రబాబు వారితో కలిసి టీ కూడా తాగారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం బాపట్లలో టీడీపీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇప్పటివరకూ ప్రతీ ఎన్నికల్లో సంప్రదాయ రాజకీయాలు చేసిన చంద్రబాబు గత ఎన్నికల్లో సైతం ప్రత్యర్ధి పార్టీ వైసీపీ ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా నియమించుకోవడాన్ని సైతం తప్పుబట్టారు. ఆయన్ను బీహార్ డెకాయిట్ గా అభివర్ణించారు. అయితే పీకే వ్యూహాలు ఫలించి వైసీపీ ఘన విజయం సాధించడం, టీడీపీ దారుణ పరాజయం చవిచూడటంతో తాను కూడా పీకేతో గతంలో కలిసి పనిచేసిన రాబిన్ శర్మను వ్యూహకర్తగా నియమించుకున్నారు. అంతేకాదు ఆయన చెప్పినట్లు వ్యూహాలు కూడా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ చాయ్ పే చర్చ చేపట్టినట్లు తెలుస్తోంది.ఇది సక్సెస్ అయితే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రచార వ్యూహాలు తెరపైకి రాబోతున్నాయి.