భూమా మృతికి కారణం ఎవరు?: ఆయనే చెప్పారు.. జగన్ను లాగిన బాబు
మంత్రి పదవి ఇవ్వకపోవడంవల్లే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఒత్తిడికిలోనై గుండెపోటుతో మృతి చెందాడన్న విపక్షాల ఆరోపణల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం స్పందించారు.
అమరావతి: మంత్రి పదవి ఇవ్వకపోవడంవల్లే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఒత్తిడికిలోనై గుండెపోటుతో మృతి చెందాడన్న విపక్షాల ఆరోపణల పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం స్పందించారు.
మంత్రి పదవి ఇవ్వొద్దని చెప్పి
భూమా నాగిరెడ్డి పార్టీ మారిన తర్వాత జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. భూమాకు మంత్రి పదవి ఇవ్వవద్దని గవర్నర్ను కలిసింది వైసిపి నేతలేనని, ఇప్పుడేమే పదవి రాకనే క్షోభతో చనిపోయారని విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు.
భూమాను క్షోభకు గురి చేసిందెవరు?
భూమా నాగిరెడ్డిని మానసిక క్షోభకు గురి చేసింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. జగన్ కాదా అని అడిగారు. సాటి జీవి చనిపోతే పక్షులు, పశువులు కూడా సానుభూతి చూపుతాయని, జగన్ మాత్రం కనీసం ఆ సానుభూతి చూపలేకపోయారన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం మానుకోవాలన్నారు.
వైయస్ చనిపోయినప్పుడు వెళ్లా..
తనకు, జగన్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని స్వయంగా వైసిపి అధినేతనే చెప్పాడని, ఆ తేడా ఏమిటో ఈ రోజు ప్రజలు గమనించారని చంద్రబాబు అన్నారు. తన రాజకీయ జీవితంలో వైయస్ రాజశేఖర రెడ్డి అంత తీవ్రంగా తనను ఎవరూ విమర్శించలేదని, అయినా ఆయన చనిపోయినప్పుడు తాను వెళ్లి పరామర్శించానని చెప్పారు.
అఖిలను మేం పిలువలేదు
భూమాకు మంత్రి పదవి ఇవ్వొద్దని గవర్నర్ కలిసి అడ్డుకున్నవారే, మంత్రి పదవి రాక క్షోభతో చనిపోయారని ఇప్పుడు విమర్శలు చేయడం ఏమిటని మండిపడ్డారు. అఖిలప్రియను తాము సభకు పిలవలేదని, తన తండ్రి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నందున బాధ్యతగా ఆమెనే వచ్చారన్నారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సభలో చెప్పుకునేందుకు వచ్చారని తెలిపారు.