'కెటిఆర్, హరీష్లని చూపించి బాబు క్లాస్': 'జగన్ లక్షకోట్లు సంపాదించలేదా'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు తన మంత్రులకు క్లాస్ పీకిన సందర్భాలు ఉన్నాయన్నారు. తెలంగాణ మంత్రులు కెటిఆర్, హరీష్ రావులను చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారని చెప్పారు.
గవర్నర్ నరసింహన్ను జగన్ కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ట్రైబ్స్ అడ్వయిజరీ కమిటీ, తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన తుని సంఘటన తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును ఆపేందుకు కృషి చేయడం లేదన్నారు. కనీసం మాట్లాడే పరిస్థితుల్లో బాబు లేడన్నారు. కెసిఆర్తో కుమ్మక్కయ్యాడని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నేపథ్యంలో కేసుల నుంచి బయటపడేందుకు కాంప్రమైజ్ అయ్యారన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని జగన్ అడ్డుకుంటున్నారు: పల్లె
ఐదేళ్లు ఎంపీగా పని చేసిన ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్ర సమస్యల పైన ఏనాడు పార్లమెంటులో మాట్లాడలేదని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్ లక్ష కోట్లు సంపాదించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారన్నారు.
వరంగల్, అమరావతిలని అభివృద్ధి చేస్తాం: వెంకయ్య
అందరికీ ఇల్లు పథకంలో ప్రతిపాదనలు పంపటంలో తెలుగు రాష్ట్రాలు ముందు ఉన్నాయని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ఢిల్లీలో చెప్పారు. అమృత్ పథకం కింద తెలంగాణలో 12 నగరాలు, ఏపీలో 33 నగరాలకు నిధులు కేటాయిస్తామన్నారు. వారసత్వ నగరాల కింద అమరావతి, వరంగల్ నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు.