గద్దె దించాలని చూశారా?: మోడీపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, ‘మైత్రేయన్ భావోద్వేగం’
న్యూఢిల్లీ: ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి, టీడీపీ చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం, బుధవారం కూడా పలువురు జాతీయ పార్టీల నేతలను కలిసి ఏపీకి అండగా ఉండాలని కోరారు.
రాజకీయాలు కాదు! బీజేపీతో అవినీతి పార్టీ, అందుకే.: ఎన్డీఏపై తేల్చిన బాబు, మీడియా ప్రశ్నలతో ఇబ్బంది
విభజన హామీలు అమలు చేయకుండా ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్రం వైఖరికి నిరసన తెలపాలని కోరారు. కాగా, మంగళవారం చంద్రబాబును కలిసిన సందర్బంగా అన్నాడీఎంకె నేత డాక్టర్ మైత్రేయన్ పాత రోజులను గుర్తు చేసుకున్నారు.
బాబుతో మైత్రేయన్ భావేద్వం
క్యాన్సర్ నిపుణుడైన మైత్రేయన్.. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యాన్సర్తో కన్నుమూసినప్పుడు ఆమె మరణ ధ్రువీకరణపత్రంపై సంతకం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకుని కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
ఎన్టీఆర్ సతీమణి మరణం.. సంతకం చేశానని మైత్రేయన్
‘పార్లమెంటు సెంట్రల్హాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశాను. చంద్రబాబు అత్త బసవతారకానికి 1984లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వైద్యం చేసిన నాటినుంచి ఆయన నాకు తెలుసు. ఆమె మరణ ధ్రువీకరణపత్రంపై నేనే సంతకం చేశాను. 2008లో కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలతో యూఎన్పీఏ ఏర్పాటు చేయడానికి జరిగిన ప్రయత్నాలు కూడా నాకు గుర్తుకొచ్చాయి. పోయస్గార్డెన్లో నాడు జరిగిన సమావేశానికి ప్రకాశ్కారత్, ఏబీ బర్దన్, ములాయంసింగ్ యాదవ్, చంద్రబాబునాయుడు, ఓంప్రకాశ్చౌతాలా, బాబూలాల్ మరాండి, సర్బేందు సోనోవాల్లు, అమ్మ(జయలలిత) అతిథులుగా వచ్చారు. అవన్నీ మరిచిపోలేని గతస్మృతులు' అని మైత్రేయన్ వ్యాఖ్యానించారు.
మోడీని గద్దె దించాలని చూశా
ఇది ఇలా ఉండగా, ఢిల్లీలో ఉన్న చంద్రబాబు జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గుజరాత్ అల్లర్ల తర్వాత నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అందరికన్నా ముందు మీరే కదా డిమాండ్ చేశారు? అనే ప్రశ్నకు బదులుగా... అవునని చంద్రబాబు సమాధానం చెప్పారు.
మోడీ గుర్తుంచుకున్నారేమో..
జరిగిన విషయాలను చరిత్ర రికార్డుల నుంచి ఎవరూ చెరిపివేయలేరని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే మోడీతో చేతులు కలిపానని.. కానీ, ఆయన ఇలా చేస్తారని తాను అనుకోలేదని చెప్పారు. అప్పట్లో మీరు అన్న మాటలను మోడీ గుర్తుంచుకున్నారేమో? అనే ప్రశ్నకు బదులుగా... గుర్తుంచుకొని ఉండవచ్చేమో అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
మోడీ అలా భావిస్తున్నారా? అంటే..
ఏపీకి కేంద్రం సాయం చేస్తే, అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలను అధిగమిస్తుందనే భావనతో మోడీ మీకు సహాయం చేయడం లేదా? అనే ప్రశ్నకు బదులుగా... ఆ విషయాన్ని మీరే గ్రహించాలని చంద్రబాబు అన్నారు. ఏపీ పట్ల గవర్నర్ నరసింహన్ సానుకూలంగా స్పందించడం లేదా? అనే ప్రశ్నకు బదులుగా 'అవును' అన్నట్టు తల ఊపారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు వివరించేందుకే తాను ఢిల్లీకి వచ్చానని చెప్పారు. తనకు ప్రస్తుతం రాజకీయాలకంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.