బీజేపీతో దోస్తీ-లాభాలు: పవన్ ఔట్, ఢిల్లీలో.. జగన్ వ్యూహానికి బాబు చెక్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చెలిమి కోరుకుంటున్నారా? ఇటీవల మళ్లీ తనను కేసులు చుట్టుముడుతుండటంతో మోడీ ఆదుకుంటారని భావిస్తున్నారంటున్నారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చెలిమి కోరుకుంటున్నారా? ఇటీవల మళ్లీ తనను కేసులు చుట్టుముడుతుండటంతో ప్రధాని మోడీ మాత్రమే ఆదుకుంటారని భావిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, ప్రత్యేక హోదా, ప్యాకేజీ అంశాల నేపథ్యంలో ఓ సమయంలో చంద్రబాబు బీజేపీకి దూరం జరిగినా జరగవచ్చుననే వాదనలు వినిపించాయి. కానీ, ప్యాకేజీకి చట్టబద్దతకు కేంద్రం సిద్ధమయింది. దానిని చంద్రబాబు స్వాగతించారు.
'జగన్కు ప్రణబ్ అపాయింట్మెంట్ ఎలా ఇచ్చారు, రమాకాంత్ను విచారించాలి'
పైగా సోమవారం జరిగిన ఎన్డీయే భాగస్వామ్యపక్షాల భేటీలో చంద్రబాబు ప్రధాని మోడీని ఆకాశానికెత్తారు. ఆ సమయంలోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి వెళ్తామని స్పష్టతను ఇచ్చారు. దీంతో 2019లో టిడిపి - బిజెపి కలిసే పోటీ చేస్తాయని అర్థమవుతోంది.
బీజేపీ కూడా టిడిపికి ధీటుగా ఎదగాలనుకుంటోంది. కానీ ఆ పార్టీకి అంతగా పట్టు లేదు. కాబట్టి ఓ స్థాయికి వచ్చే వరకు తెలుగుదేశం పార్టీతో కలిసి ఉండటమే మంచిదని ఢిల్లీస్థాయి బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు కూడా కొందరు ఆలోచిస్తున్నారు.
ఢిల్లీలో జగన్ ప్రయత్నాలు
ఇక, జగన్ విషానికి విషయానికి వస్తే ఇటీవల ఆయనను కేసులు మళ్లీ చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటన చేశారు. ఢిల్లీలో బీజేపీతో దోస్తీ కోసం ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోందని అంటున్నారు.
వరుస షాక్లు
వరుసగా ఎదురవుతున్న ప్రతికూల పరిణామాలు జగన్ను కలవరానికి గురి చేస్తున్నాయనే అంటున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు దక్కాయి. వారికి పదవులు ఇవ్వకుండా గవర్నర్ నరసింహన్ అడ్డపడతారని భావించారు. కానీ అది నెరవేరలేదు.
దీంతో, ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలంటూ 'సేవ్ డెమొక్రసీ' పేరిట ప్రజల్లోకి వెళ్లినా స్పందన కనిపించకపోవడం వైసీపీని నిరాశ పరిచినట్లు చెబుతున్నారు. ఇలా రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండగా మరోవైపు అక్రమాస్తుల కేసు, షెల్ కంపెనీలతో బంధాలపై దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ జోరు పెంచుతుండటం మానసికంగానూ ఆందోళన పెంచుతోందని వైసిపిలోనే గుసగుసలాడుకుంటున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ దూరం.. జగన్కు అవకాశం
ఇలాంటి తరుణంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జత కట్టడం మేలని జగన్ భావిస్తున్నారన్న చర్చ సాగుతోందని చెబుతున్నారు. బీజేపీకి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దూరం కావడం తమకు అందివచ్చిన అవకాశంగా జగన్ భావిస్తున్నారని కూడా చెబుతున్నారు.
మోడీ కరిష్మా
2019 సార్వత్రిక ఎన్నికల నాటికి బిజెపితే జత కడితే రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు, ప్రధాని మోడీ కరిష్మా తోడవుతుందని వైసిపి భావిస్తోందని అంటున్నారు. తన కేసుల అంశానికి కూడా ఇది ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారట.
2019లో గెలుపుతో పాటు..
బీజేపీతో జతకడితే 2019లో తనకు రాజకీయంగా ఉపయోగపడటంతో పాటు కేసుల విచారణలో వేడి కూడా తగ్గుతుందని వైసిపి భావిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే సేవ్ డెమోక్రసీ పేరిట ఢిల్లీ యాత్ర చేపట్టారని అంటున్నారు. మూడు రోజుల క్రితం జగన్ మాట్లాడుతూ.. బీజేపీని ప్రభావితం చేసే నేతలతో తాను ఫిరాయింపుల గురించి మాట్లాడుతానని చెప్పారు.
జగన్ వ్యూహాన్ని పసిగట్టిన చంద్రబాబు
టిడిపి పట్ల బీజేపీలో వ్యతిరేక భావం నెలకొనేలా చేయడం, తద్వారా బీజేపీకి దగ్గర కావడం జగన్ వ్యూహంగా మోడీ అప్పాయింట్మెంట్ కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే మోడీ అప్పాయింట్మెంటూ దొరకలేదు. త్వరలో దొరకవచ్చునని అంటున్నారు. జగన్ వ్యూహాన్ని పసిగట్టడం వల్లే చంద్రబాబు ఎన్డీయే పార్టీల భేటీలో మోడీని ఆకాశానికెత్తారని, తద్వారా జగన్ వ్యూహాలకు చెక్ చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు.