సంకల్ప పత్రంలో రాయొచ్చు, బాధ్యతారాహిత్యం: జగన్కు చంద్రబాబు కౌంటర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు భారీగా నిధులు వెచ్చిస్తున్నట్లు కొందరు చేస్తున్న విమర్శలు వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తమ రాజధాని నిర్మాణం ఎలా జరగాలని అనుకుంటున్నారో వారి వారి మనోభావాలను ప్రజలు సంకల్ప పత్రాలపై రాయవచ్చునని ఆయన సూచించారు.
ప్రజారాజధాని నిర్మాణంలో ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని, శంకుస్థాపన కార్యక్రమానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి హంగామా చేయాలని అనుకోవడం లేదని ఆయన చెప్పారు. వీలైనంత ఎక్కువమందిని భాగస్వామ్యులను చేయడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కుబడిగా కాకుండా మొక్కు తీర్చుకొనే కార్యక్రమంలా రాజధాని శంకుస్థాపనను భావించాలని అన్నారు.
గురువారం ఆయన తన నివాసం నుంచి గురువారం సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతకు ముందు రాజధాని ఆహ్వాన కమిటీతో సమీక్ష సమావేశం నిర్వహించారు.నమ్మకం, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం పునాదులుగా ప్రజారాజధానిని నిర్మిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ గంటా పదిహేను నిమిషాలపాటు పాల్గొంటారని, ఆ వ్యవధిలో శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిన అవసరముందని చెప్పారు. రాష్ట్రంలోని 16 వేల గ్రామాలు, పుణ్యనదులు, దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు, ప్రముఖుల నివాస ప్రాంతాల నుంచి సేకరించిన మట్టి, నీటిని విజయదశమికి ముందురోజే సీఆర్డీయే ప్రాంతంలో వెదజల్లాలని ఆయన అధికారుల సూచించారు.
పవిత్రమైన మట్టిని, జలాలను భూమిలో కలిపిన తర్వాతే శంకుస్థాపన జరపడం సముచితంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు అన్నారు. నీటి సంఘాలు, డ్వాక్రా సంఘాలు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో సహా అందరికీ శంకుస్థాపన ఆహ్వాన పత్రాలు పంపించాలని సీఎం అధికారులను ఆదేశించారు.