చెప్పాలనుకున్నారు: చంద్రబాబు ఫోన్ ఎత్తని ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడడానికి ప్రయత్నించారు. అయితే, అది వీలు కాలేదు.
చంద్రబాబు చేసిన ఫోన్ కాల్ను ప్రధాని తీసుకోలేదు. ఈ విషయాన్ని బుధవారం మీడియా సమావేశంలో చంద్రబాబే స్వయంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పిన తర్వాత చంద్రబాబు బుధవారం రాత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటించారు.
మర్యాదగా భావించి....
కేంద్ర ప్రభుత్వం నుంచి తాము తప్పుకుంటున్నామని చెప్పడం మర్యాదగా భావించి ప్రధాని మోడీతో మాట్లాడడానికి ప్రయత్నించానని, కేంద్ర ప్రభుత్వంలో చేరడం ద్వారా తాము తమ ప్రయోజనాలు నెరవేరుతాయని భావించామని, అది నెరవేరకపోవడంతో ప్రభుత్వం నుంచి తప్పుకుంటున్నామని చెప్పాలని తాను అనుకున్నానని చంద్రబాబు వివరించారు.
Recommended Video
నా బాధ్యతగా భావించా...
తమ పార్టీ నిర్ణయాన్ని ప్రధానికి తెలియజేయడం సంకీర్ణ భాగస్వామిగా తన బాధ్యతగా భావించినట్లు చంద్రబాబు తెలిపారు. తన ఓఎస్డీ ప్రధాన మంత్రి ఓఎస్డీతో మాట్లాడారని, అయితే, ప్రధాని లైన్లోకి రాలేదని ఆయన వివరించారు.
ప్రత్యామ్నాయం ఓపెన్...
ఆప్షన్ ఓపెన్గా ఉంచే ఉద్దేశంతో చంద్రబాబు ఎన్డీఎ నుంచి తప్పుకుంటున్నట్లు వెంటనే ప్రకటించలేదని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వబోమని అరుణ్ జైట్లీ చెప్పిన తర్వాత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి తమ మంత్రులు తప్పుకుంటారని ప్రకటించారు. కానీ ఎన్డీఎ నుంచి తప్పుకునే పిషయంపై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ఆ తర్వాతి దశ అదే...
బిజెపి నేతృత్వంలోని ఎన్డీఎ కూటమి నుంచి తమ పార్టీ తప్పుకోవడం లాంఛనమేనని తెలుగుదేశం పార్టీ వర్గాలంటున్నాయి. కేంద్ర మంత్రుల రాజీనామా నిర్ణయంపై కేంద్రం ప్రతిస్పందన చూసిన తర్వాత చంద్రబాబు తదుపరి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. కేంద్రం ప్రతిస్పందించకపోతే ఎన్డీఎ నుంచి తప్పుకోవడమే తదుపరి చర్య అని చెబుతున్నారు.