మొట్టికాయ వేసినా: కేసీఆర్పై బాబు, హైదరాబాద్పై..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అసహనం వ్యక్తం చేశారు. కోర్టు మొట్టికాయ వేసినా తెలంగాణ సర్కారులో ఎలాంటి మార్పు లేదన్నారు. రాజకీయం వేరు, పాలన వేరు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే తనను, తన పార్టీని టార్గెట్ చేస్తోందని విమర్శించారు. ఎన్నో అడ్డంకులు సృష్టిస్తూనే, తన పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణ సర్కారు వైఖరి హైదరాబాదుకు అన్యాయం చేస్తుందన్నారు. స్థానికత పైన హైదరాబాదులోని ఇతర రాష్ట్రాల ప్రజల నుండి వ్యతిరేకత వస్తోందన్నారు.
హెరిటేజ్ అంటూ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని, మొదట మీడియాను తర్వాత టీడీపీని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు అన్యాయం చేయాలని ఎప్పుడూ కోరలేదన్నారు. తెరాస ప్రభుత్వం ఏకపక్షంగా వెళుతుందని ఆయన దుయ్యబట్టారు. 1956 స్థానికత తీసుకువస్తే హైదరాబాద్లో ఉండేది ఎవరని ఆయన ప్రశ్నించారు. దీని వల్ల తెలంగాణకే నష్టమన్నారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు వెళదామన్నారు.
మంత్రులకు ఆదేశం
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి వివాదాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం విశాఖ జిల్లా సీనియర్ నేత, మంత్రి అయ్యన్నపాత్రుడు తనను కలిసిన తర్వాత చంద్రబాబు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మంత్రుల వ్యవహార సరళికి సంబంధించి పలు సలహాలు, సూచనలు చేశారు.
అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలని చెప్పారు. అంతేకాక ప్రభుత్వ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులను దూరంగా ఉంచాలని సూచించారు. ఏదేనీ వివాదం తలెత్తితే సదరు మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఆ విషయాల్లో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా ఏమాత్రం బాధ్యత వహించబోదని కూడా ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. విలేకరుల సమావేశంలోని మాట్లాడుతూ... ఇష్టం వచ్చినట్లు బదలీలు చేయవద్దని మంత్రులకు చెప్పానని తెలిపారు.
చంద్రబాబు జపాన్ పర్యటన ఖరారు
చంద్రబాబు జపాన్లో జరపనున్న పర్యటన ఆదివారం ఖరారైంది. ఈ నెల 23 రాత్రి హైదరాబాద్ నుంచి జపాన్ బయలుదేరనున్న ఆయన ఆరు రోజుల పాటు అక్కడ సుదీర్ఘ పర్యటన సాగించనున్నారు. సింగపూర్లో మూడు రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు శుక్రవారం అర్ధరాత్రి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు.
సింగపూర్ పర్యటన విజయవంతమైన నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో ఆయన జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రభుత్వంతో పాటు పారిశ్రామికవేత్తలను కూడా కలుస్తారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించాలని కూడా చంద్రబాబు జపాన్ ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఆరు రోజుల పర్యటనను ముగించుకుని జపాన్ నుంచి ఈ నెల 29న చంద్రబాబు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.