వైఎస్ జగన్పై దాడికి చంద్రబాబు చేతికి కొత్త ఆయుధం: ఆ డిమాండ్కు రాజకీయ రంగు
అమరావతి: ఏపీ-తెలంగాణ మధ్య మొన్నటిదాకా పోలవరం వ్యవహారం మాటల యుద్ధానికి తెర తీసింది. పోలవరం ప్రాజెక్ట్ వల్లే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలు గ్రామాలు నీట మునిగాయంటూ తెలంగాణ మంత్రులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కొత్తగా ముంపు మండలాల వ్యవహారం తెర మీదికి వచ్చింది. రాష్ట్ర విభజన చోటు చేసుకున్న తొలి రోజుల్లో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు మళ్లీ వివాదానికి కేంద్రబిందువు అయింది.

విలీన గ్రామాల అంశం..
రాజకీయ రంగును కూడా పులముకుంటోంది. గోదావరి నది వదరపోటుకు గురైన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం తమను ఆదుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ అయిదు గ్రామాల ప్రజల రోడ్డెక్కారు. నాలుగైదు రోజులుగా ఆందోళనలను చేపడుతున్నారు. అయిదు గ్రామాలను ఏపీ నుంచి తెలంగాణలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేస్తోన్నారు. కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తమపట్నం, ఎటపాక గ్రామాల ప్రజలు ఈ డిమాండ్ లేవనెత్తారు.

రాజకీయ రంగు..
భద్రాచలం శివారులో రోడ్డుపై వాహనాలు నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. అక్కడే బైఠాయించారు. సరిహద్దు గ్రామాలు కావటంతో రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే పోడుం వీరయ్య మద్దతు ప్రకటించారు. ఆందోళనకారులు జిల్లా కలెక్టర్ కారును కూడా అడ్డుకుని, తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ఆందోళనలు రాజకీయ రంగును పులుముకొన్నాయి.

చంద్రబాబు డిమాండ్స్..
తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఆందోళనలకు మద్దతు ప్రకటించారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇవ్వాళ వరుస ట్వీట్లు పెట్టారు. గోదావరి వరదలతో రెండు వారాలుగా ప్రజలు నరకాన్ని చవి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీన మండలాల్లో 14 రోజులుగా విద్యుత్ సరఫరా లేదని చెప్పారు. ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు అత్యంత దారుణమని అన్నారు.

మంచినీళ్లు దొరకట్లే..
కరెంట్ రాకపోవడంతో తాగడానికి మంచినీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇళ్లను శుభ్రపరుచుకోవడానికి నీళ్లు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో వారున్నారని అన్నారు. బురద, కూలిన చెట్లను తొలగించి రోడ్లపై రాకపోకలు పునరుద్ధరించే కనీస ప్రయత్నాలను కూడా ఏపీ ప్రభుత్వం చేయట్లేదని ఆరోపించారు. వారం క్రితమే వరదలు తగ్గాయని చెబుతోన్న మంత్రులు ఇప్పటికీ విద్యుత్ సరఫరాను, రాకపోకలను ఎందుకు పునరుద్దరించ లేకపోయారో చెప్పాలని నిలదీశారు.

ఎదురుదాడి కాదు..
జగన్ సర్కారు నుంచి వరద బాధితులకు కనీస సాయం అందకపోవడం వల్ల ఎటపాక మండలం ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. తమను పొరుగు రాష్ట్రంలో కలపమని ప్రజలు అడుగుతున్నారంటే ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయినట్టేనని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యతను వహించాల్సి ఉంటుందని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలపై ఎదురుదాడి చెయ్యడం మాని ప్రజల వద్దకు వెళితే వాస్తవాలు తెలుస్తాయని హితబోధ చేశారు.

సమస్యలు పరిష్కరించండి..
వరదకు చనిపోయిన పశువుల కళేబరాల నుంచి వెలువడే దుర్వాసన, ఇళ్లల్లో వస్తోన్న విష సర్పాలు, దోమలు, పురుగులతో నిద్రాహారాలు లేకుండా ఆయా గ్రామాల ప్రజలు రోజులు గడుపుతున్నారని చెప్పారు. ప్రభుత్వ పెద్దలు గాలిలో పర్యటనలతో కాలక్షేపం చేస్తోన్నారని విమర్శించారు. గాలి మాటలు పక్కన పెట్టి యుద్దప్రాతిపదికన వరద ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications