Air India సంచలన నిర్ణయం.. విమానాలు బంద్..??
పశ్చిమాసియాలో ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం, ఇంధన ధరల పెంపు కారణంగా ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా సంస్థ తన అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో భారీ కోత విధించింది. ఈ మేరకు విమాన సర్వీసులను తగ్గిస్తూ ప్రకటన విడుదల చేసింది. జూన్ నుంచి ఆగస్టు 2026 వరకు ఈ మార్పులు ఉంటాయని పేర్కొంది. వారానికి సుమారు 250 అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించాలని ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.
మరోవైపు సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో జెట్ ఫ్యూయల్ ధరలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రెట్టింపు అయ్యాయి. బ్యారెల్ కు సుమారు 163 డాలర్లు పెరిగింది. ఇక విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో ఇంధనం వాటా 40శాతం వరకు ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు మరింత భారంగా మారనుంది. అలాగే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విమానాలు ఎగరడానికి అనుమతి లేదు. దీనివల్ల విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దాని ఫలితంగా ఇంధన ఖర్చు భారీగా పెరుగుతోంది.
ఇక రద్దు చేసిన రూట్ల వివరాలు చూస్తే.. దిల్లీ నుంచి చికాగో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేసింది. దిల్లీ నుంచి నెవార్క్, ముంబై నుంచి న్యూయార్క్, దిల్లీ నుంచి షాంఘై, చెన్నై నుంచి సింగపూర్, దిల్లీ నుంచి పారిస్, దిల్లీ నుంచి టొరంటో, దిల్లీ నుంచి ఖాట్మండూ విమాన సర్వీసులు కూడా భారీగా తగ్గాయి. మరోవైపు సర్వీసుల కోత ఉన్నప్పటికీ ఎయిర్ ఇండియా నెలకు 1200 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలను యథాతథంగా నడుపుతోంది. ఇక విమానాలు రద్దు అయిన ప్రయాణికులకు పూర్తి రీఫండ్, ఉచితంగా తేదీ మార్పు లేదా ప్రత్యామ్నాయ విమానాల్లో సర్దుబాటు చేస్తామని ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది.

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇటీవల ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దని సూచించారు. అలాగే పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు. అంతేకాక ఏడాదిపాటు విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగ్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications