చంద్రబాబుతో బిజెపి పొత్తు: పురంధేశ్వరికి చిక్కులు
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తెలుగుదేశం, బిజెపి అవగాహనకు వచ్చినప్పటికీ సీట్ల విషయంలో అవగాహన కుదరడం లేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపితో పొత్తు పెట్టుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఆ మేరకు అవగాహనకు కూడా వచ్చారు. కానీ, బిజెపి అడుగుతున్న సీట్లు ఇవ్వడానికి మాత్రం ఆయన మొండికేస్తున్నట్లు సమాచారం.
విశాఖపట్నం, విజయవాడ లోకసభ స్థానాల విషయంలో ఇరు పార్టీల మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. విశాఖపట్నం గానీ, విజయవాడ గానీ తమకు కేటాయించాలని బిజెపి నాయకులు అడుగుతున్నారు. కానీ ఆ రెండు సీట్లలో కూడా తామే పోటీ చేస్తామని చంద్రబాబు అంటున్నారని సమాచారం. దాంతో మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చిక్కుల్లో పడ్డారు.
కాంగ్రెసు నుంచి తమ పార్టీలోకి వచ్చిన పురంధేశ్వరికి విశాఖఫట్నం లేదా విజయవాడ సీటు కేటాయించాలనే ఉద్దేశంతో బిజెపి నాయకత్వం ఉంది. కానీ, చంద్రబాబు అందుకు అంగీకరించడం లేదని అంటున్నారు. ఈ రెండు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ బిజెపికి ఇవ్వకపోతే పురంధేశ్వరి ప్రకాశం జిల్లా ఒంగోలు లోకసభ స్థానం నుంచి పోటీ చేయాల్సి వస్తుంది.
ఒంగోలు స్థానంలో విజయం సాధించడం పురంధేశ్వరికి అంత సులభం కాదు. విశాఖపట్నం సీటు విషయంలోనే పురంధేశ్వరి కాంగ్రెసు నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. విశాఖపట్నం నుంచి మారాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ తనకు సూచించడంపై పురంధేశ్వరి గుర్రుమన్నారు. దిగ్విజయ్ సింగ్పై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు.
పురంధేశ్వరి భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారు. దాంతో పురంధేశ్వరికి కూడా ఎసరు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, బిజెపి అధికారంలోకి వస్తుందని నమ్ముతున్న స్థితిలో పురంధేశ్వరి గెలిస్తే కేంద్రంలో ఆమె పట్టు బిగిస్తారు. దానివల్ల తన ప్రాధాన్యం తగ్గవచ్చుననే ఉద్దేశం కూడా చంద్రబాబుకు ఉన్నట్లు చెబుతున్నారు. పురంధేశ్వరికి విశాఖపట్నంపైనే మనసు ఉందని అంటున్నారు. బిజెపి, తెలుగుదేశం పార్టీలు పొత్తుపై, సీట్ల కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడితే తప్ప పురంధేశ్వరి సీటుపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.