పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలి - భారతీ సిమెంట్ పైనా : కుప్పంలో తమిళంలో చంద్రబాబు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేసారు. కుప్పంలో వరుసగా జరిగిన స్థానిక సంస్థలు - మున్సిపల్ ఎన్నికల్లో తనను దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన పెద్దిరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ పుంగనూరులో ఓడిస్తానని చంద్రబాబు శపధం చేసారు. అయితే, దీనికి మంత్రి పెద్దిరెడ్డి సైతం ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. కుప్పంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించటం పెద్ద కష్టం కాదంటూ ధీమా వ్యక్తం చేసారు. ఇక, కుప్పంలో చివరి రోజు పర్యటనలో భాగంగా.. ఆయన పెద్దిరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసారు.

కుప్పంలో పెద్దిరెడ్డిని లక్ష్యంగా చేసుకొని
అక్రమ మైనింగ్ అంశం పైన ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. అటవీప్రాంతంలో క్వారీలు నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు అని నిలదీశారు. వైసీపీ నేతల దోపిడీకి అడ్డుఅదుపులేకుండా పోయిందని, క్వారీలకు కనీస అనుమతులు లేకుండా.. ఖనిజ సంపదను దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడని తప్పుబట్టారు. కుప్పం అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అక్రమ మైనింగ్కు పాల్పడేవారిని వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. గుడిపల్లి మండలం జాతకర్తనపల్లి రోడ్ షోలో ఆసక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది.

తమిళంలో చంద్రబాబు పలకరింపు
అక్కడ ఉన్న వారంతా తమిళం మాట్లాడుతారని.. తమిళంలో ప్రసంగించాలని స్థానికులు కోరారు. దీంతో.. చంద్రబాబు వారందరికీ ఎల్లాం నల్లా ఇరుక్కణం అంటూ పలకరించారు. ఈ సారి అక్కడకు వచ్చే సమయానికి తమిళం బాగా నేర్చుకొని మాట్లాడుతానని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండపడ్డారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పులివెందుల్లో చేపల మార్కెట్, అక్కడక్కడా మటన్ మార్కెట్లను పెట్టి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇదే ఆయన జాబ్ చార్ట్ అని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత బ్రాండ్లతో మద్యం పెట్టి ఆర్జిస్తున్నారన్నారు.

భారతీ సిమెంట్ పైనా విమర్శలు
భారతి సిమెంట్ ధరలు పెంచి లాభాలు ఆర్జిస్తూ, రాష్ట్రాన్ని దివాలా తేసేలా చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ విషయంలో అవసరమైతే జాతీయస్థాయిలో దీనిపై పోరాడుతాం. అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బుల్ని ఎన్నికల్లో పంచారు. జిల్లా ఎమ్మెల్యేలు సైతం కుప్పంలో అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు. స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ క్వారీలను దర్జాగా కొనసాగిస్తున్నారు. ఖనిజ సంపదను దోచేస్తున్న వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పాలి.

కుప్పంలో పూర్తయిన పర్యటన
దీనిని కేంద్ర అటవీశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు కుప్పం పర్యటనలో ప్రధానంగా వైసీపీ.. అందులోనూ మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యంగా ప్రసంగాలు చేసారు. అదే సమయంలో పొత్తుల గురించి కుప్పం వేదికగానే కీలక వ్యాఖ్యలు చేసారు. తన మనసులోని మాటను బయట పెట్టారు. చిత్తూరు జిల్లాలో ఇప్పుడు చంద్రబాబు - పెద్దిరెడ్డి మధ్య వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఎవరు ఓడిస్తారనే చర్చ రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications