పురంధేశ్వరికి రాజంపేట సీటు: చంద్రబాబు అసంతృప్తి
హైదరాబాద్: వదిన దగ్గుబాటి పురంధేశ్వరికి సీటు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పావులు కదిపిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు బిజెపిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్లు సమాచారం. పురంధేశ్వరికి రాజంపేట సీటు కేటాయించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
విశాఖపట్నం సీటు పురంధేశ్వరికి ఇవ్వవద్దంటూ చంద్రబాబు పెట్టిన ఒత్తిడికి బిజెపి తలొగ్గింది. విశాఖ సీటును పురంధేశ్వరికి కాకుండా హరిబాబుకు బిజెపి కేటాయించింది. అయితే, ఆమెకు రాజంపేట సీటు కేటాయించడంపై కూడా తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.

నర్సారాపుపేట సీటును బిజెపి రాజకీయాలకు కొత్తవాడైన రఘునాథరావుకు కేటాయించడంపై కూడా తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజమండ్రి సీటుపై బిజెపిలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం సీటును బిజెపికి ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి నెలకొంది. బిజెపి అడగకున్నా ఆ సీటు ఇచ్చారని అంటున్నారు.
నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానాన్ని బిజెపికి ఇవ్వడంపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీకి 15 శాసనసభా స్థానాలు, 4 పార్లమెంటు సీట్లు ఇచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇరు పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. విజయం సాధించలేని నేతలను బిజెపి పోటీకి దించుతోందని తెలుగుదేశం పార్టీ నాయకులు వాదిస్తున్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ సీటును బిజెపికి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications