వెయ్యి డాలర్లా?: బాబు సమావేశాల్లో ముందు కూర్చోవడానికి ఇంత చెల్లించాలా?
అయితే చంద్రబాబు పాల్గొనే సభల్లో ముందు వరుసలో కూర్చోవాలనుకునేవారికి వెయ్యి డాలర్ల రేటు ఫిక్స్ చేశారట. ఆ మేరకు వెయ్యి డాలర్లు చెల్లించినవారినే ముందువరుసలో కూర్చొనిస్తారట.
డల్లాస్: అధికార పార్టీ వైఖరిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఏపీలో ప్రతిపక్ష వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. దానికి తగ్గట్లు ప్రత్యర్థులకు మేలు చేకూర్చేలా ఏదో వివాదంలో ఇరుక్కోవడం అటు టీడీపీకి కూడా అలవాటులా మారిపోయింది.
అసలే ప్రత్యర్థులు.. ఏమాత్రం సంధు దొరికినా.. విమర్శలకు పని చెప్పడం కామన్. తాజాగా మరోసారి విదేశీయాత్రకు సిద్దమవుతున్న చంద్రబాబుపై ఇప్పటికే విమర్శలు మొదలైపోయాయి. ప్రధానిని సైతం మించిపోయేలా ప్రపంచ టూర్లు చేస్తున్నారన్న ముద్ర ఇప్పటికే చంద్రబాబుపై ఉండగా.. విదేశాల్లో ఆయన సమావేశాలకు టికెట్లు కూడా పెడుతుండటం ప్రస్తుతం ప్రత్యర్థుల నోటికి పనిచెప్పింది.
కాగా, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మే 3వ తేదీ నుంచి మే 12వరకు అమెరికాలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పాల్గొనే సభల్లో ముందు వరుసలో కూర్చోవాలనుకునేవారికి వెయ్యి డాలర్ల రేటు ఫిక్స్ చేశారట. ఆ మేరకు వెయ్యి డాలర్లు చెల్లించినవారినే ముందువరుసలో కూర్చొనిస్తారట.
దీంతో ఇదేమైనా నిధులను సేకరించడానికి ఏర్పాటు చేసిన సభనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ నిధులతోనే చంద్రబాబు విదేశాల్లో పర్యటిస్తున్నా.. సభా నిర్వాహకులం తామేననే రీతిలో టీడీపీ నాయకులు వ్యవహరిస్తుండటం కూడా విమర్శలకు దారి తీస్తోంది.