చంద్రబాబు భయం, అమిత్ షా అతి జాగ్రత్త ? ముందుకు సాగని టీడీపీ-బీజేపీ పొత్తు!
ఏపీలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు ఉంటుందా లేదా అన్న చర్చ విపరీతంగా నడుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ సందర్భంగా ఎన్డీయే భేటీలో పాల్గొనడం, ఆ తర్వాత బీజేపీ నేతలతో ఇదే అంశంపై తీవ్రంగా చర్చోపచర్చలు సాగించినట్లు ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటి కంటే కూడా ఇప్పుడు రెండు విషయాలు బీజేపీతో టీడీపీ పొత్తు వ్యవహారం ముందుకు సాగకపోవడానికి కారణంగా తెలుస్తోంది.
ఏపీలో ప్రస్తుతం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకులు వైసీపీకి గంపగుత్తగా మద్దతుగా నిలుస్తున్నాయి. అదే సమయంలో టీడీపీకి గతంలో అండగా ఉన్న బీసీలు కూడా దాదాపు దూరమయ్యారు. వీరు తిరిగి వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో టీడీపీవైపు మళ్లుతారో లేదా కచ్చితంగా తెలియదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు అండగా ఉంటున్న కాపులకూ, అటు బీసీలతోనూ, ఇటు ఎస్సీలతోనూ సఖ్యత లేదు. దీంతో ఒకరిని చేరదీస్తే మరొకరు వ్యతిరేకం అయ్యే పరిస్ధితులున్నాయి. ఇలాంటి సమయంలో కాస్తో కూస్తో మద్దతుగా ఉన్న ముస్లింలను సైతం బీజేపీతో పొత్తు పెట్టుకుని దూరం చేసుకునే పరిస్ధితి చంద్రబాబుకు లేదు.

అలాగని జగన్ తరహాలో దూరంగా ఉంటూ ఎన్డీయేకు మద్దతిద్దామంటే కుదిరేలా లేదు. అసలే బీజేపీ ఈ పార్లమెంట్ సమావేశాల్లో ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కామన్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌరస్మృతి)బిల్లు తెచ్చేందుకు సిద్దమవుతోంది. దీనికి మద్దతివ్వక తప్పని పరిస్ధితుల్లోవైసీపీ, టీడీపీ ఉన్నాయి. అదే జరిగితే రాష్ట్రంలో ముస్లింలు ఎటు మొగ్గుతారో తెలియదు. ఈ నేపథ్యంలో బీజేపీతో వెంటనే జట్టు కట్టి ముస్లింలను దూరం చేసుకునే పరిస్ధితి చంద్రబాబుకు లేదు. అందుకే టీడీపీ-బీజేపీ పొత్తు ఆలస్యమవుతున్నట్లు కనిపిస్తోంది.
మరోవైపు పొత్తులకు కీలకమైన బీజేపీ అగ్రనేత అమిత్ షా గతంలో చంద్రబాబుతో నాలుగేళ్ల విరామం తర్వాత తాజాగా భేటీ అయ్యారు. అయితే తెలంగాణలో టీడీపీ మద్దతు తీసుకునే లక్ష్యంతో ఆయన చంద్రబాబును దువ్వుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఏపీ వరకూ వచ్చే సరికి పరిస్ధితుల్ని బట్టి టీడీపీని కలుపుకుని ముందుకు వెళ్లాలనుకుంటున్నారు.
ఎందుకంటే ఏపీలో వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా అంతిమంగా కేంద్రంలో ఎన్డీయేకు మద్దతుగానే ఉంటాయి. అటువంటప్పుడు టీడీపీని ప్రత్యేకంగా చేరదీయడానికి కేవలం వారితో కలిసి పోటీ చేస్తే కొన్ని సీట్లయినా గెల్చుకోవడన్న ఆశ మాత్రమే. అయితే ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి తెలంగాణ ఎన్నికల తర్వాత పొత్తుపై నిర్ణయం తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది.












Click it and Unblock the Notifications