వదిలిపెట్టం: కేంద్రానికి చంద్రబాబు వార్నింగ్, ‘పవన్ వంతపాడితే.. జగన్ ఎద్దేవా చేస్తున్నారు’
Recommended Video
కాకినాడ: కేంద్రం రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ మైదానంలో చేపట్టిన ధర్మపోరాట సభలో ఆయన ప్రసంగించారు. భావితరాల భవిష్యత్తు కోసమే ధర్మపోరాట దీక్ష చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
వదిలిపెట్టమంటూ హెచ్చరిక
అన్యాయం చేస్తే వదిలిపెట్టబోమని కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్రానికి అన్యాయం చేసినవారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, హామీల అమలు సాధనకు పోరాటాలే శరణ్యమని అన్నారు. ఎవరైనా మాటిస్తే నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ.. దేవుడి పేరు చెప్పుకొని ఓట్లడిగే బీజేపీ తిరుమల వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే ఏమనుకోవాలని ప్రశ్నించారు.
నమ్మక ద్రోహం.. పిడికిలి బిగిస్తే..
విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్కు నమ్మకద్రోహం చేసిందని చంద్రబాబు అన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధానికి సహకరిస్తానన్న ప్రధాని మోడీ.. అమరావతి నిర్మాణానికి కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. సర్దార్పటేల్ విగ్రహానికి రూ.2500 కోట్లు ఇచ్చారని అన్నారు. ఎవరికి ఎంత ఇచ్చినా తాము తప్పుబట్టమని.. కానీ, ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. పిడికిలి బిగించి పోరాడుదామని, విజయం మనదే చంద్రబాబు అని పిలుపునిచ్చారు.
కేంద్రంపై విమర్శల వర్షం
దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని.. ఇదేం పరిపాలన? అని చంద్రబాబు నిలదీశారు. బ్యాంకులపై నమ్మకం పోవడానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి లండన్ పారిపోయాడని.. బ్యాంకుల్లో కుంభకోణాలు పెరిగాయని చంద్రబాబు ఆరోపించారు. స్విస్ బ్యాంకుల్లో 2017లో 50శాతం నిధులు పెరిగాయని వార్తలు వచ్చాయని, మరి స్విస్ బ్యాంకుల్లో డబ్బులు ఎవరివన్నారు. నల్లధనం వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని మోడీ అన్నారని, నల్లధనంలో 15 పైసలైనా వచ్చాయా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
కేంద్రాన్ని నిలదీస్తూ..
విభజన సమయంలో ప్రత్యేక హోదా బీజేపీ వల్లే వచ్చిందని, వెంకయ్య నాయుడు పోరాడారని చెప్పుకున్న బీజేపీ ఏపీకి ఎందుకు హోదా ఇవ్వడంలేదని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణంపై ఎందుకు శీతకన్ను వేస్తున్నారంటూ నిలదీశారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రానికి బాధ్యత లేదా? ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని నిలదీశారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను తూచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన బీజేపీ..ఆ దిశగా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం, మభ్యపెట్టడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. మాజీ ప్రధాని వాజ్పేయీ సంకల్పం నదుల అనుసంధానం అని మోడీ అన్నారనీ.. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి తాము నిరూపించామన్నారు.
మోడీకి పవన్ వంతపాడుతున్నారు
ఎన్నికల ప్రచారం సందర్భంలో పవన్ కళ్యాణ్ ముందే ఆనాడు మోడీ అన్ని హామీలు ఇచ్చారని చంద్రబాబు అన్నారు. కానీ ఈ రోజు పవన్ ప్రధానిపై ఒక్కమాటా మాట్లాడటం లేదని విమర్శించారు. పైగా ఆయన కేంద్రానికే వంతపాడుతూ తనను విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. ఇంత దారుణంగా మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని చెప్పారు. రాష్ట్ర విభజన హామీల సాధన కోసం తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లినా ఫలితం లేదని అన్నారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధించినట్టు చెప్పారు.
జగన్ ఎద్దేవా చేస్తున్నారు
దక్షిణ భారతంలో తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ వెనుబడి ఉందని, అలా వెనుబడడానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని చెప్పిన కేంద్రం ఎక్కడ చేసిందని నిలదీశారు. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఎంపీ, ఎమ్మెల్సీ నిరాహార దీక్ష చేస్తే ప్రతిపక్ష నేత జగన్ ఎద్దేవా చేస్తున్నారన్నారు. తనను పిలిస్తే ఫ్యాక్టరీ పెడతానంటూ గాలి జనార్దన్రెడ్డి అంటున్నాడని.. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం కేంద్రానికి ఎందుకు సాధ్యంకాదన్నారు.
జగన్ లాంటి నేరస్తులను ప్రోత్సహిస్తారా.
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ నిన్న టీడీపీ ఎంపీలు ఢిల్లీ వెళ్లి కలిస్తే ఉక్కు శాఖ మంత్రి మాయ మాటలు చెప్పారన్నారు. టీడీపీ ఎంపీలు ప్రైవేటుగా మాట్లాడిన వాటిని వక్రీకరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎంపీల ప్రతిష్ఠ దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నేరస్థులను ప్రోత్సహించే స్థాయికి ప్రధాని చేరుకోవడం బాధాకరమన్నారు. ఎన్నికలు రావు కాబట్టే వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలు ఆడారన్నారు.