జగన్ కోర్టుకెళితే రూ.30కోట్లు: మండలి రద్దుపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టిన చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శాసనమండలిని రద్దు చేస్తూ చేసిన తీర్మానికి ఆమోదం తెలపడంపై ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మండలి రద్దు విచారకరమని అన్నారు. జగన్ సర్కారు చర్యను ఆయన తప్పుబట్టారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం: సీఎం జగన్ కీలక ప్రసంగం
జగన్కు ఆ దమ్ముందా?
మూడు రాజధానుల బిల్లును మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపారనే ఆక్రోశంతో శాసనమండలి రద్దుకు తీర్మానం చేసి పంపడం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బిల్లుల విషయంలో ఎవరు రాజకీయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో లోక్సభకు ఎన్ని అధికారాలు ఉంటాయో.. రాజ్యసభకు కూడా అన్ని అధికారాలు ఉంటాయని చెప్పారు. అసెంబ్లీలో ఉన్న 86 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై వివిధ రకాల కేసులున్నాయని.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ నేరస్తుల ముఠాకు మద్దతు పలుకుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆ నేరస్తులనే జగన్ మేధావులని పేర్కొనడం విచారకరమని అన్నారు. ఎమ్మెల్యేల కేసులపై సమాధానం చెప్పే దమ్ము సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు.
రూ. 20కోట్ల ఆఫర్.. మా నేతలను ప్రలోభపెట్టిందెవరు?
కేసులు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టింది మీరు కాదా? అని సీఎం జగన్ను ప్రశ్నించారు చంద్రబాబు. ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాత్ రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్లను ప్రలోభపెట్టడంలో మీ చొరవ లేదా? అని సీఎంను నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్సీల్లో చాలా మందికి రూ. 20 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారని.. అయితే తమ ఎమ్మెల్సీలు తలవంచకపోవడంతో మండలిని రద్దు చేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. సర్కారు ప్రలోభాలకు లొంగకుండా ఉన్న తమ ఎమ్మెల్సీలను ప్రజల తరపున అభినందిస్తున్నట్లు తెలిపారు. 22 మంది మంత్రులు మండలిలో ఉండి అడ్డుదారులు తొక్కారని.. ఛైర్మన్ షరీఫ్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి మండలిపై చేసిన వ్యాఖ్యల వీడియోలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు.
మండలిలో ఓటింగ్ డ్రామా...
చివరికి మండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ సమయంలోనూ నాటకం ఆడారన్నారు. మొదట సభలో 121 మంది ఉన్నారని చెప్పి.. ఆఖరుకు 133 మంది ఉన్నారని ప్రకటించడమేంటని చంద్రబాబు నిలదీశారు. ఇటీవల 10 రాష్ట్రాలు తమ రాష్ట్రంలో మండలిని పునరుద్ధరించాలంటూ కేంద్రాన్ని కోరాయని ఆయన తెలిపారు.
జగన్ కోర్టుకెళితే.. 30కోట్ల ఖర్చు.. మండలికి రూ. 60కోట్లు
సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టులకు వెళితే రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 30 కోట్లు ఖర్చవుతోందని.. అలాంటప్పుడు శాసనమండలి నిర్వహణకు సంవత్సరానికి రూ. 60 కోట్లు ఖర్చు పెట్టడం పెద్ద విషయమేం కాదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ తెచ్చింది తామేనని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లుపై తాము సవరణలు మాత్రమే పెట్టామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమాన్ని తాము వ్యతిరేకించలేదని, మాతృభాష తెలుగును కాపాడుకోవాలని మాత్రమే చెప్పామన్నారు.
కడపకు రూ. 1400 కోట్లా...?
రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఆధారాలుంటే ఎందుకు బయటపెడ్డటం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. కమిటీల పేరుతో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. విశాఖ అభివృద్ధికి టీడీపీ అనుకూలమని చెప్పిన చంద్రబాబు.. విశాఖను ఆర్థిక రాజధాని, టెక్నాలజీ హబ్, ఫార్మ, పర్యాటక కేంద్రంగా చేయాలనుకున్నామని తెలిపారు. కడప జిల్లాకు ఇచ్చిన రూ. 1400 కోట్లు.. శ్రీకాకుళం జిల్లాకు ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఏదైనా మేలు చేసి అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు.