మార్పు, విభజన మత్తు జల్లారు: చంద్రబాబు ఫైర్
హైదరాబాద్: విభజనపై ఇప్పటి వరకు సమన్యాయం అంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని విభజించడంపై కేంద్రాన్ని తప్పు పడుతూ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే కేంద్రం విభజన మత్తు జల్లిందని ఆరోపించారు. ఆ మత్తు దిగితేనే ప్రజలకు అసలు విషయం తెలుస్తుందని అన్నారు.
హైదరాబాద్ లాంటి రాజధానిని ఎలా నిర్మిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. పలు యూనివర్సిటీలు, బ్యాంకుల కేంద్ర కార్యాలయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డూ హైదరాబాద్లోనే ఉన్నాయని అన్నారు. విభజనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆ మూడు పార్టీలకు పరాజయం తప్పదని చెప్పారు. ఉమ్మడి రాజధాని అంశం ఎక్కడా లేదని చంద్రబాబు అన్నారు. రాజధాని ఉన్న ప్రాంతం ఇంతవరకు విభజన కోరుకోలేదని అన్నారు.

విభజన పేరుతో కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని చంద్రబాబు ఆరోపించారు. కేంద్రానికి సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశం గానీ, ఆలోచన గానీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ చెప్పినట్లు కేంద్రమంత్రుల్లు బంట్రోతుల్లా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజ్యాంగంపై సోనియాకు అవగాహన లేదని చంద్రబాబు నాయుడు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని చంద్రబాబు అన్నారు. ఇక ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగేందుకు యూపిఏకు అర్హత లేదని అన్నారు. పార్లమెంటు సభ్యులంతా కలిసి అవిశ్వాస తీర్మానం ద్వారా యూపిఏను ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని తెలిపారు. అవినీతి కనుమరుగు కావాలన్నా, పారదర్శక పాలన రావాలన్నా.. కాంగ్రెస్ను ఇంటికి పంపాల్సిందేనని అన్నారు.












Click it and Unblock the Notifications