నా మంత్రుల్ని డిస్మిస్ చేస్తా, సాక్షిని తీసుకుంటా: జగన్పై ఊగిపోయిన బాబు, బిజెపిపైనా
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో బుధవారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలవరం ప్రాజెక్టు, జగన్కు బిజెపి మద్దతు, రాజధానిలో కుంభకోణం అన్న సాక్షి పైన, వైసిపి పైన చంద్రబాబు ఊగిపోయారు.
రాజధాని ప్రాంతంలో తన పైన నమ్మకంతో ప్రజలు, రైతులు భూములు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. మంత్రులు నారాయణ, పత్తిపాటి నారాయణ, దేవినేని ఉమామహేశ్వర రావు, తదితరులపై వైసిపి, సాక్షి తీవ్ర ఆరోపణలు చేసిందన్నారు. రాజధానిలో బినామీలపై జగన్ నిరూపిస్తే తాను తన మంత్రులను డిస్మిస్ చేస్తానని చెప్పారు.
జగన్ అవినీతిపరుడు అని, అందుకే క్రిమినల్ కేసులు పెట్టారన్నారు. వదిలి పెట్టే సమస్య లేదన్నారు. నీవు అవినీతిలో ఉన్నావు కాబట్టి అవినీతి బురద అందరికీ రుద్దాలని చూడవద్దన్నారు. మేం రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నామన్నారు.
మంత్రులను డిస్మిస్ చేస్తా, ఈ రోజు డిస్మిస్ చేస్తా, ధైర్యం ఉంటే ఆ నెంబర్లు ఎక్కడున్నాయో చెప్పమని సవాల్ విసిరుతున్నా, సాక్షి అడ్డంగా అవినీతి పేపర్, రేపో ఎల్లుంటే తీసుకుంటాం, సాక్షఇ పత్రికను తీసుకుంటాం,
పోలవరం ఈ రోజే కేంద్రానికి ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. జగన్ ఏదో ఆరోపణ చేస్తే మీరు కూడా వారికి మద్దతు పలుకుతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పోలవరం ప్రాజెక్టును వెంటనే కేంద్రానికి అప్పగిస్తానని చెప్పారు. అనవసరంగా రాజకీయం కోసం ప్రాజెక్టులకు అడ్డుపడవద్దన్నారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపించాలని లేదంటే తోక జాడిస్తే ఊరుకునేది లేదన్నారు.
టిడిపి నేతల పైన ఆరోపణలు చేశారని, బినామీలు ఉన్నారని చెప్పారని, భూములు కొన్నారని చెప్పారని, అవి తేలాకే సభ ముందుకు వెళ్లాలన్నారు. అప్పటి దాకా వేరే విషయం మాట్లాడేందుకు అవకాశమే లేదన్నారు. ముందు వాటిని తేల్చాలన్నారు. లేదా క్షమాపణలు చెప్పాక ముందుకెళ్లాలన్నారు.
జగన్ మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాకే కేసులు పెట్టారన్నారు. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కేసులు లేవన్నారు. కాంగ్రెస్, టిడిపి కలిసి తన పైన కేసులు పెట్టాయన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ కలిసి తనను కేసుల్లో ఇరికించారన్నారు.
పత్తిపాటి వర్సెస్ జగన్
రాజధాని ప్రాంతంలో భూకంభకోణం జరిగిందని జగన్ ఆరోపించారు. అమరావతి ప్రాంతంలో టిడిపి నేతలు భూములు ఎలా కొన్నారని ప్రశ్నించారు. రాజధాని కోసం అటవీ భూమిని డీనోటిఫై చేస్తామని కేంద్రం చెప్పినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
మాస్టర్ ప్లాన్కు రూ.12వేల కోట్లు ఇచ్చారని, కానీ గవర్నర్ ప్రసంగంలో ఉచితంగా సింగపూర్ ప్లాన్ ఇచ్చినట్లుగా చెప్పిందన్నారు. పేదల భూములు టీడీపి కొన్నాక రాజధాని ప్రకటించి, మీ బినామీలకు మేలు జరిగేలా ప్యాకేజీని ప్రకటించారన్నారు. రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా భూమికి ఇచ్చి రైతులను ముంచారన్నారు.
మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... రాజధానిలో భూదందా అని జగన్కు చెందిన సాక్షి పత్రిక అసత్యాలు రాసిందన్నారు. మంత్రి దేవినేని ఉమ భూములు కొన్నారని రాశారని, ఆయన కొనలేదన్నారు. ఆయనకు ఏమైనా ఆస్తులు లేవా అన్నారు. బినామీలు అని చెప్పడం సరికాదన్నారు.
జగన్ మాట్లాడుతూ.. మంత్రి పత్తిపాటి పుల్లారావుకు భుజాలు తడుముకోవడం అలవాటేనని ఎద్దేవా చేశారు.
పత్తిపాటి మాట్లాడుతూ... నేను సవాల్ చేస్తున్నానని, జగన్కు సిబిఐ పైన నమ్మకం ఉంటే.. ఆ సంస్థ చెప్పినట్లుగా జగన్ వద్ద ఉన్న రూ.43వేల కోట్లు ప్రజలకు ఇచ్చేయాలన్నారు. అప్పుడు సిబిఐ విచారణ కోసం డిమాండ్ చేయాలన్నారు.
జగన్ మాట్లాడుతూ... సిబిఐ తన వద్ద రూ.43వేల కోట్లు ఉన్నట్లు నిర్ధారించిందా.. అయితే, అందులో పావు వంతు తనకు ఇవ్వాలని, అప్పుడు తాను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని చెప్పారు.