Chandrababu : చంద్రబాబుకు నెక్ట్స్ ఏంటి ? ఢిల్లీకి బయలుదేరిన లోకేష్..!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, అనంతరం రాజమండ్రి జైలు నుంచి ఇంటికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రెస్ట్ తీసుకోనున్నారు. సాయంత్రం తిరుమల బయలుదేరి వెళతారు. మరోవైపు చంద్రబాబుకు విధించిన బెయిల్ షరతుల్లో మరికొన్నింటిని చేర్చాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ కూడా విచారణ జరగబోతోంది.
స్కిల్ కేసులో ఏపీ హైకోర్టులో బెయిల్ కోరడాని కంటే ముందు తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా చేసిన రిమాండ్ చెల్లదంటూ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై వాదనలు ముగియడంతో గత నెలలోనే సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ తీర్పు ఈ నెల 8న ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమవుతోంది. దీంతో చంద్రబాబు ఇప్పుడు ఆ తీర్పుపై దృష్టిసారిస్తున్నారు. ఈ తీర్పు అనుకూలంగా వస్తే సరి, లేకపోతే ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెడుతున్నారు.

ఇందుకోసం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు విషయంలో లాయర్లతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన లోకేష్.. అక్కడ తమ లాయర్లు హరీష్ సాల్వే, సిద్ధార్ధ్ లూథ్రాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. తీర్పు ఎలా వస్తే ఏం చేయాలన్న దానిపై లోకేష్ వారితో చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చల తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుని చంద్రబాబు కంటి ఆపరేషన్ సమయంలో అక్కడే ఉండనున్నారు.
మరోవైపు చంద్రబాబు బెయిల్ పై విడుదలైనా, హైకోర్టు షరతుల విషయంలో టీడీపీ క్యాడర్ కాస్త అసంతృప్తిగా ఉంది. దీంతో టీడీపీ లాయర్లు హైకోర్టులో కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో చంద్రబాబుకు రాజకీయంగా సమావేశాల ఏర్పాటు, పర్యటనలు తప్పనిసరని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications