బాహుబలి సినిమాను చూపించారు, ఐదేళ్లలో రాజధాని కోసం 5 వేల కోట్లు ఖర్చు చేశారు: అసెంబ్లీలో సీఎం జగన్
అమరావతి రాజధాని పరిధిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజధాని ఇక్కడ వస్తోందని చెప్పి టీడీపీ నేతలకు చెప్పడంతో వారు భూములు కొనుగోలు చేశారని చెప్పారు. రైతుల నుంచి బలవంతంగా భూములు కొనుగోలు చేశారని చెప్పారు. రాజధాని ఇక్కడ వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పినా.. వినిపించుకోలేదని విమర్శించారు.

30 కి.మీ దూరం..
మూడు పంటలు పండే జరీబు భూముల్లో రాజధాని నిర్మిస్తున్నామని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ముందుకొచ్చారని చెప్పారు. రాజధాని ప్రాంతం ఉన్న గ్రామాలు విజయవాడ-గుంటూరు కనీసం 30 నుంచి 38 కిలోమీటర్ల దూరం ఉంటుందని చెప్పారు. అభివృద్ధి ఒకేచోట జరిగితే నష్టం వస్తోందని.. ఇదే విషయాన్ని శ్రీ కృష్ణ కమిటీ చెప్పిందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ రోజు ఏపీ చరిత్రలో సుదినం అని, గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేశారు. మరోవైపు సీఎం జగన్ మాట్లాడే సమయంలో పోడియం వద్ద ఆందోళన చేసిన 17 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారం సస్పెండ్ చేశారు.

ఇవిగో సాక్ష్యాలు..
రాజధాని మార్పు అవసరమని శివరామకృష్ణన్ మాట్లాడిన వీడియోను సభలో సీఎం జగన్ వీడియో ప్రదర్శించారు. రాజధాని విజయవాడ-గుంటూరు ఎంత దూరమనే అంశంపై క్లిప్ కూడా చూపించారు. తాత్కాలిక అసెంబ్లీకి రావాలంటే ఒక వాహనం పోతే తప్ప.. మరో వాహనం రాని పరిస్థితి నెలకొందనే ఫోటోను సభలో ప్రదర్శించారు.

అభూత కల్పన
రాజధాని పేరుతో చంద్రబాబు అభూత కల్పనను నిజం అని నమ్మించారని జగన్ విమర్శించారు. రాజధాని కోసం 5 లక్షల కోట్ల ఖర్చుచేస్తామని.. కేవలం 5 వేల కోట్లు మాత్రమే ఖర్చుచేశారని చెప్పారు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన పత్రికలో రాజధాని నిర్మాణం కోసం లక్షా 9 వేల కోట్లు అవసరమని అంచనాలు అని చెప్పారు. ప్రభుత్వ 20 ఎకరాల భూమి.. రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాల భూమిని కలిపి 55 వేల ఎకరాల మొత్తం లక్ష కోట్లు అని చెప్పారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications