పొగాకు రైతలకు కొత్త రూల్స్: ఈ ఏడాది పంట ఇంతే!
పొగాకు రైతుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునే లక్ష్యంతో, ఈసారి సాగు మరియు కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పొగాకు బోర్డు తాజా పంట సీజన్కు సంబంధించి కీలకమైన నిర్ణయాలను ప్రకటించింది.
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వర్జీనియా పొగాకు పంట ఉత్పత్తి పరిమాణాన్ని 8.1 కోట్ల కిలోలకే పరిమితం చేయాలని పొగాకు బోర్డు నిర్ణయించింది. బోర్డు ఛైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్, ఈడీ విశ్వశ్రీ, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో కూడిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.

గతేడాది (2025-26) 14.2 కోట్ల కిలోల పంటను నిర్ణయించినప్పటికీ, ఉత్పత్తి ఏకంగా 23.6 కోట్ల కిలోలకు పెరగడం, తద్వారా మార్కెట్లో ధరలు పడిపోయి రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవడంపై బోర్డు సుదీర్ఘంగా చర్చించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, కొనుగోలుదారుల నుంచి వస్తున్న స్పందనను పరిగణనలోకి తీసుకుని, పంట కంట్రోల్ లో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది.
కమిటీ ఏర్పాటు.. నిరంతర పర్యవేక్షణ
పొగాకు మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, పంట నియంత్రణ విధానాలను మరింత పకడ్బందీగా అమలు చేయడానికి భాగస్వాములందరితో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల మార్కెట్లో అస్థిరతను నివారించి, రైతులు నష్టపోకుండా ఉండేందుకు వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు.
క్వింటాల్కు రూ.200కు తగ్గకుండా..
రైతులకు కచ్చితంగా గిట్టుబాటు ధర దక్కాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కఠిన ఆదేశాలు జారీ చేశారు. వర్జీనియా పొగాకు కిలో ధర రూ.200 కంటే తక్కువకు పడిపోకుండా చూడాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోళ్లలో రైతులకు నష్టం వాటిల్లకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
వర్జీనియా పొగాకు పండించే జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి ఈ విషయాలను స్పష్టం చేశారు. పంట కొనుగోళ్లతో పాటు, రైతులకు అవసరమైన ఎరువుల లభ్యత, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.














Click it and Unblock the Notifications