ఏపీలో డేంజర్ పురుగులు..కంట్లోపడితే చూపు పోయే ప్రమాదం.. ఆ జిల్లా వారికి నరకం!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో డేంజర్ పురుగులు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు ఓ చిన్న పురుగు పెద్ద సమస్యగా మారింది. యాసిడ్ పురుగులుగా చెప్పే ఈ పురుగులు నర్సరీల్లో పని చేసే వాళ్లను భయపెడుతున్నాయి. ముఖ్యంగా కడియం ప్రాంతంలో మొక్కల పెంపకం, రవాణా సమయంలో ఈ పురుగులు శరీరంపై పాకుతున్నాయి. దీని కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఏపీలో డేంజర్ పురుగులు.. వాటినుండి పెడిరిన్ అనే విషపదార్థం
కొందరు భయంతో చేతులతో నలిపేస్తే సమస్య మరింత పెరిగిపోతోంది. ఈ పురుగులు చూడటానికి చీమలాగా పొడవుగా ఉంటాయి. వీటిని పెడిరోవ్ బీటిల్స్ అని కూడా అంటారు. ఇవి కుట్టవు కానీ, నలిపితే తోక భాగం నుంచి పెడిరిన్ అనే విషపదార్థం వెలువడుతుంది. దీని వల్ల చర్మంపై దద్దుర్లు, తీవ్ర దురద, మంట, అలర్జీ వంటి సమస్యలు వస్తున్నాయి. కడియం నర్సరీల్లో వేలాది మంది కూలీలు రోజువారీ పని చేస్తుంటారు.

నర్సరీలలో పని చేసే కార్మికులకు పురుగులతో ఇబ్బంది
వర్షాలు పడటంతో నర్సరీలలో మొక్కల డిమాండ్ పెరిగి, ఎక్కువ మొక్కలను పెంచుతూ ఎక్కువ మంది పని చేస్తున్న సమయంలో అక్కడ పని చేస్తున్న కార్మికులు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.డాక్టర్లు ఈ విషయంలో ముఖ్యమైన హెచ్చరికలు ఇస్తున్నారు. పురుగు ఒంటిపై పాకినా నలిపేయకుండా జాగ్రత్తగా తొలగించాలని సూచిస్తున్నారు. పురుగు తాకిన చేసిన చోట సబ్బు నీటితో మెల్లగా కడగాలి.
కళ్ళలో పడితే చూపు పోయే ప్రమాదం
రుద్దడం, గోకడం వంటివి చేయకూడదు. మరీ ముఖ్యంగా కళ్లలో పడకుండా చాలా జాగ్రత్త వహించాలి. పొరపాటున కళ్లలో పడితే చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సమస్యను 'నైరోబీ ఐ' అని కూడా అంటారు. అలర్జీ వచ్చిన వాళ్లు సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ను సంప్రదించి సరైన మందులు వాడాలి.
యాసిడ్ పురుగులపై వైద్యుల అలెర్ట్
నర్సరీల్లో పనిచేసే వాళ్లంతా రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పురుగులు వర్షాకాలంలో ఎక్కువగా కనిపిస్తాయని, తగిన జాగ్రత్తలతో సమస్యను అధిగమించవచ్చని అధికారులు చెబుతున్నారు. కడియం మొక్కల నర్సరీలు తెలుగు రాష్ట్రాలకు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడి కార్మికుల ఆరోగ్యం కాపాడటంలో భాగంగా వైద్యులు వారికి యాసిడ్ పురుగుల నుండి రక్షించుకోవటానికి ఏం చెయ్యాలో చెప్తున్నారు.













Click it and Unblock the Notifications