టీచర్లకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్: సచివాలయాల్లో పెను మార్పులు
Chandrababu Naidu: రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటయింది. ఈ ఉదయం 11: 27 నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం విభజనాంధ్ర ప్రదేశ్లో ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోనున్నారు.

చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. అర్ధరాత్రి వారి జాబితాను సిద్ధం అయింది. ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాలో పవన్ కల్యాణ్ సహా జనసేన పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కు మంత్రివర్గంలో చోటు దక్కింది. బీజేపీ నుంచి వై సత్యకుమార్ను తీసుకున్నారు.
మొన్నటివరకు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన చంద్రబాబు ఇప్పుడు పరిపాలనపై దృష్టి సారించనున్నారు. తొలిసశాఖలవారీగా తాజా నివేదికలను ఇప్పటికే తెప్పించుకున్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీ మీద పెట్టొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు ఈ హామీని ఇచ్చారు కూడా.
వైఎస్ జగన్ బ్రైన్ ఛైల్డ్ గ్రామ/వార్డు సచివాలయాల్లో భారీగా మార్పులు చేర్పులు చేయొచ్చని తెలుస్తోంది. అక్కడి సిబ్బందిని ఇతర అనుబంధ శాఖల్లో సర్దుబాటు చేస్తారని చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్- 5 వారికి సంబంధిత మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.
అధిక సంఖ్యలో గ్రేడ్-5 కార్యదర్శులను గ్రేడ్-4 గా ప్రమోషన్ కల్పిస్తారని తెలుస్తోంది. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వీళ్లే కీలక పాత్ర పోషిస్తారని సమాచారం. వారికి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వర్తించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు.
డిజిటల్ అసిస్టెంట్లను జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్గా బదలాయిస్తూ విద్యా మంత్రిత్వ శాఖకు మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పనులను వారికి కేటాయించవచ్చు. ప్రతి హైస్కూల్కు ఒకరు చొప్పున కంప్యూటర్ ఆపరేటర్ను కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉపాధ్యాయులను అన్ని బోధనేతర పనుల నుంచి తప్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇది వారికి ఊరట కలిగించే విషయమే. వారికి బోధనేత విధులను అప్పగించిందనే ఆరోపణలు గత ప్రభుత్వం ఎదుర్కొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications