అందుకే పార్లమెంటుకు మొక్కాను, బీజేపీ నమ్మకద్రోహం: చంద్రబాబు
అమరావతి: ఇటీవల తాను ఢిల్లీకి వెళ్లి పలు పార్టీల నేతలను కలిసి ఏపీ పట్ల కేంద్రం తీరును వివరించానని ఏపీ సీఎం చంద్రబాబు శాసన సభలో చెప్పారు. తాను మొదటి రోజు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి, పార్లమెంటును మొక్కానని చెప్పారు.
పార్లమెంటు ప్రజాస్వామ్యయుతంగా పని చేయాలని, అంబేడ్కర్ ఏ ఉద్దేశ్యంతో రాజ్యాంగాన్ని రాశారో దానిని సరిగ్గా అమలు చేయాలనే ఉద్దేశ్యంతో మొక్కినట్లు చెప్పారు. కానీ కొంతమంది పేపర్లో రాయిస్తున్నట్లు తనకు వేరే ఉద్దేశ్యం లేదన్నారు. ఏపీని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నదే తన అభిమతం అన్నారు.
చివరి బడ్జెట్లో కూడా ఏపీకి అన్యాయం జరిగిందన్నారు. న్యాయం చేయాలంటూ ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేశారన్నారు. ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా కేంద్రం నుంచి ఇద్దరు మంత్రులు వైదొలిగారన్నారు. విభజన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు.
అవిశ్వాస తీర్మానంపై 13 రోజులుగా కాలాయాపన చేశారన్నారు. హోదాపై బీజేపీ నమ్మక ద్రోహం చేసిందన్నారు. ప్రజల ఆకాంక్షను పట్టించుకోకుండా అవిశ్వాసంపై చర్చ జరగకుండా సభను వాయిదా వేశారన్నారు. టీడీపీకి ఓ విశిష్టత ఉందని, ఓసారి ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు పోరాడుతుందన్నారు.
విభజన చట్టంలోని హామీలు నెరవేర్చమని అడిగితే రక్షణ శాఖకు ఇచ్చే నిధులు కూడా అడుగుతున్నారంటూ ఎగతాళి చేశారన్నారు. వైసీపీ నేతలు ఎప్పుడు ఏం చేస్తారో వారికే తెలియదన్నారు. బీజేపీ తప్పు చేసింది కాబట్టి అఖిల పక్ష సమావేశానికి రావడం లేదన్నారు.
చట్టంలో ఉన్నవి ఎందుకు అమలు చేయలేదని గట్టిగా నిలదీస్తే చెప్పలేకపోతున్నారన్నారు. ఐదుగురు ఎంపీలతో అవిశ్వాస తీర్మానం పెట్టామని వైసీపీ చెబుతుందని, వారు నామమాత్రంగానే పెట్టారన్నారు. విభజన రోజు మోసం జరిగింది, ఇప్పుడు ఏపీకి నమ్మక ద్రోహం జరిగిందన్నారు.