జగన్! ఇప్పుడూ కక్కుర్తేనా? మొదట్నుంచి అనేక తప్పులు: చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రతిపక్షం చేస్తున్న సూచనలను రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని తక్కువ అంచనా వేయొద్దని అన్నారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
మిగితా రాష్ట్రాలతో పోలిస్తే సోమవారం ఏపీలో కేసులు బాగా పెరిగాయని, తాము చెప్పేదాన్ని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాల విషయంలో చెలగాటం వద్దని, ప్రతి విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని జగన్ సర్కారుకు చంద్రబాబు హితవు పలికారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో రెడ్ జోన్లు ఉన్నాయని, హాట్ స్పాట్లపై ప్రత్యేక శ్రద్ద పెడితే తప్ప కరోనాను నివారించలేమని అన్నారు.
మొదట్నుంచి అనేక తప్పులు
వైద్యులు, సిబ్బందికి కరోనా సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని వైసీపీ సర్కారును చంద్రబాబు ప్రశ్నించారు. వైద్యులకు మాస్కులు, పీపీఈ ఇస్తున్నారా? అని నిలదీశారు. వైద్యులు, వైద్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కరోనా కట్టడి విషయంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అనేక సార్లు కోరినా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని అన్నారు. కరోనాపై పోరులో జగన్ సర్కారు మొదట్నుంచి అనేక తప్పులు చేస్తోందని, విపక్ష నేతలు ఏం మాట్లాడినా ఎదురుదాడి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను చెబితే కేసులు పెడతారా? అని నిలదీశారు.
ఇలాంటి సమయంలోనూ కక్కుర్తేనా?
మన పొరుగు రాష్ట్రం ఛత్తీస్గడ్ రూ. 350కు టెస్టింగ్ కిట్ తెచ్చుకుంటే.. ఏపీలో మాత్రం రూ. 730 చొప్పును కొనుగోలు చేశారని అన్నారు. ఇప్పుడేమో ధర తగ్గుతుందని చెబుతున్నారని.. ఇలాంటి సమయంలో కూడా కక్కుర్తి ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఎదురుదాడికి భయపడేది లేదని, ప్రజల సంక్షేమం కోసం సూచనలు చేస్తూనే ఉంటామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఉంటే పేద ప్రజలకు ఆహారం దొరికేదని, అలాంటి అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు.
Recommended Video
విపత్కర సమయంలోనూ..
కరోనా నివారణలో సాంకేతి పరిజ్ఞానం వినియోగించుకోవాలని, బయట్నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ చేయాలన్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు ఇచ్చి ఆదుకోవాలన్నారు. క్వారంటైన్లో ఉన్నవారు చనిపోతుండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఓ వైపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా జగన్ సర్కారు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. రైతులను ఆదుకుంటామనే ప్రకటనలు తప్ప చర్యలు శూన్యమన్నారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ విపత్కర సమయంలో ఎన్నికల గురించి మాట్లాడతారా? ఎస్ఈసీని తొలగిస్తూ ఆర్డినెన్స్ తెస్తారా? అని నిలదీశారు. తమిళనాడు నుంచి కనకరాజును ఎలా తీసుకొచ్చారు? అని ప్రశ్నించారు.