అంతా లోకేష్ ఇష్టం.. ఎప్పుడు రమ్మన్నా వచ్చి నిల్చొంటా: చంద్రబాబు
హైదరాబాద్ : సోమవారం నాడు టీటీడీపీ నేతలతో భేటీ సందర్బంగా.. పార్టీ అధినేత చంద్రబాబు నేతల మధ్య నవ్వులు పూయించినట్టు సమాచారం. సమావేశం సందర్బంగా టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ లో నూతనంగా నిర్మిస్తోన్న ఇంటి గురించి ఆరా చంద్రబాబును ఆరా తీయగా ఈ సన్నివేశం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఇకపోతే జూబ్లిహిల్స్లో ఉన్న తమ పాత ఇంటిని కూల్చేసి సీఎం కొత్త భవనం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త నిర్మాణం దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. దీంతో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'గృహ ప్రవేశం ఎప్పుడు సార్?' అంటూ చంద్రబాబును అడిగారట ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.
రేవంత్ ప్రశ్నకు స్పందించిన చంద్రబాబు.. 'నాదేముంది? అంతా లోకేష్ ఇష్టం.. లోకేష్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేనొచ్చి నిల్చోవడమే నా పని.. అంతకు మించి నేను చేసేదేముంది, చేయాల్సిదేముంది' అంటూ సరదాగా బదులిచ్చారట. దీంతో నేతల మధ్య నవ్వులు విరబూసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే దసరా తర్వాత గృహ ప్రవేశం జరిగే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
మరోవైపు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేసిన లోకేష్.. ఇందుకోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల పని నుంచి లోకేష్ కాస్త ఫ్రీ అయ్యాక గృహ ప్రవేశ కార్యక్రమం ఉండవచ్చునని చెప్పుకుంటున్నారు. గృహ ప్రవేశం సందర్బంగా తెలుగు రాష్ట్రాల ప్రముఖులను ఆహ్వానించే ప్రక్రియను కూడా లోకేష్ దగ్గరుండి చూసుకునే అవకాశముందని టీడీపీ నేతలు చెబుతున్నారు.