వంద కోట్లతో వందేళ్లు పడుతుంది: పోలవరంపై బాబు
హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కేంద్ర సాధారణ బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధకరమని మరోసారి అన్నారు.
సోమవారం సిఎం చంద్రబాబు అధ్యక్షతన టిడిఎల్పీ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడాలని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు సూచించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే నిధులు ఇచ్చారని.. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకూ కేంద్రం చేయూతినివ్వాలని చంద్రబాబు అన్నారు.

రూ. 100 కోట్లతో పోలవరం నిర్మించాలంటే సాధ్యమయ్యే పనికాదన్నారు. ఆ మొత్తంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుందని కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు.
జగన్పై మండిపడ్డ ఎమ్మెల్యే బొండా ఉమా
ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అగ్లీ సీన్స్ చూడాల్సి వస్తుందన్న ఆయన మాటలను తీవ్రంగా తప్పుబట్టారు. అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలపై కానీ, రైతుల సమస్యలపై కానీ చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సభ సజావుగా సహకరించేలా చూడాలి తప్ప రౌడీయిజం ప్రదర్శించవద్దని హితవు పలికారు.












Click it and Unblock the Notifications