సీఎంల్లో బాబు బెస్ట్, లోకేష్ వల్లే టిడిపిలోకి: జెసి, ఓటుకు నోటు లైట్..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అనంతపురం పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని మిగతా ముఖ్యమంత్రుల కన్నా చంద్రబాబు బెస్ట్ అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు.
చంద్రబాబుకు ఉన్న పరిచయాలు, తెలివి వల్లనే ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తున్నాయని చెప్పారు. అయితే, గతంలోని చంద్రబాబుకు, ఇప్పటి చంద్రబాబుకు ఒకింత తేడా ఉందని చెప్పారు. ఇప్పుడు ఆయన కొంత మెతక వైఖరి అవలంభిస్తున్నారన్నారు.
ఎప్పుడు కూడా అతి మంచితనం లేదా మంచితనం పనికి రాదని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు పట్టిసీమ చేపడతారని తాను కూడా ఊహించలేకపోయానని చెప్పారు. నాలుగు రోజుల క్రితం జెసి మాట్లాడుతూ.. చంద్రబాబు మనసులో ఉన్న పట్టిసీమ కోరిక నెరవేరకపోవచ్చునని చెప్పారు.
ఇప్పుడు మాత్రం పట్టిసీమ కడతారని ఊహించలేకపోయానని వ్యాఖ్యానించారు. పట్టిసీమ నీటిని కృష్ణా బ్యారేజీకి తరలించి శ్రీశైలం నీటిని రాయలసీమకు వినియోగించాలనేది చంద్రబాబు ఆలోచనగా చెప్పారు. ఓటుకు నోటు కేసు అసలు ఓ సమస్యే కాదని తీసిపారేశారు.
తాను నారా లోకేష్ మధ్యవర్తిత్వం వల్లనే తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే లేవని, ఇటీవల అనంతలో జరిగిన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సభకు కర్నాటక నుంచి జనాలను తరలించారన్నారు.
వైసీపీ అధ్యక్షులు జగన్కు ఇంకా రాజకీయ అవగాహన పెరగాలన్నారు. పరిటాల సునీత కుటుంబంతో వైరం గతమని, ఇప్పుడు ఎలాంటి విభేదాల్లేవన్నారు. డబ్బు ఖర్చు చేయకుండా ఏ నాయకుడు గెలిచే అవకాశం లేదని కుండబద్దలు కొట్టారు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టారన్నారు. భవిష్యత్ తరాలకు కూడా తీరని అన్యాయం చేసిందనే ఉద్దేశంతోనే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని చెప్పారు. జగన్ కన్నా చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ఆలోచనతో టిడిపిలో చేరానన్నారు.