ప్రపంచంలో చంద్రబాబే ఫస్ట్, గిన్నిస్లోకీ: లక్ష్మీపార్వతి, మోడీని అడిగావా: జగన్కు రావెల
గుంటూరు: అబద్ధాల పోటీ పెడితే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మొదటి స్థానం వస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి గురువారం నాడు ఎద్దేవా చేశారు. ఆయన అబద్దాల్లో గిన్నిస్ పుస్తకంలోకి కూడా ఎక్కుతాడన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ గుంటూరు జిల్లా నల్లపాడులో నిరవధిక నిరసన దీక్ష చేస్తున్నారు. ఆయన బుధవారం దీక్షను ప్రారంభించారు. రెండో రోజైన గురువారం ఆమె జగన్ దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
జగన్ దీక్ష అనూహ్య మద్దతు లభిస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలకు అక్రమంగా కోట్లు ఖర్చు పెట్టి వాహనాలు ఏర్పాటు చేస్తున్నారని, అయినా వచ్చేందుకు జనం ఆసక్తి చూపించడం లేదని విమర్శించారు.
జగన్ దీక్షకు మాత్రం జనం భారీగా తరలి వస్తున్నారని చెప్పారు. వైయస్ జగన్ చేస్తున్న దీక్ష ప్రజలకే కాకుండా రైతులకు కూడా ఓ ధైర్యం అన్నారు. జగన్ దీక్షకు ఇంత భారీ సంఖ్యలో జనం తరలిరావడం సంతోషకరమైన్నారు.
జగన్ దీక్షపై రావెల ఆగ్రహం
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైయస్ జగన్ చేపట్టిన దీక్షపై ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏనాడైనా ప్రధాని నరేంద్ర మోడీ వద్ద జగన్ ప్రస్తావించారా? అని ఆయన జగన్ను నిలదీశారు. అసలు జగన్కు దీక్ష చేసే అర్హతే లేదన్నారు.