టీడీపీ-బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్, నయీంను ప్రోత్సహించింది బాబే : కోటంరెడ్డి
హైదరాబాద్ : గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత.. నయీంను వెనుకుండి నడిపించింది ఏపీ సీఎం చంద్రబాబే అని ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా దావూద్ నయీంను పెంచి పోషించింది చంద్రబాబే అని వ్యాఖ్యానించారు కోటంరెడ్డి శ్రాధర్ రెడ్డి.
'నయీం అనే విషపు మొక్కను చంద్రబాబే పెంచి పోషించారని' తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న సందర్బంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్ల నుంచి కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ వస్తోన్న చంద్రబాబు.. ఆ సఖ్యత ద్వారా రాష్ట్రానికి ఏం సాధించి పెట్టారని ప్రశ్నించారు శ్రీధర్ రెడ్డి.
ఏపీ ప్రయోజనాల కోసం చిత్తశుద్దితో పనిచేయాలని చంద్రబాబుకు సూచించిన శ్రీధర్ రెడ్డి.. టీడీపీ బీజేపీ మధ్య కుదిరిన మ్యాచ్ ఫిక్సింగ్ మేరకే రాష్ట్ర ప్రజలను రెండు పార్టీలు మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదంటూ.. చంద్రబాబు నిలదీసిన ఆయన, రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరి దుర్మార్గంగా ఉందన్నారు.
ఢిల్లీలో ప్రధాని మోడీ ఇంటి ముందు ధర్నా చేస్తే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. కేంద్రంతో సఖ్యంగా మెలగపోతే రాజధాని భూ కుంభకోణాలు, ఓటుకు నోటు కేసుల్లో చంద్రబాబు జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టే.. చంద్రబాబు ఆ ప్రయత్నాలేవి చేయరని శ్రీధర్ రెడ్డి విమర్శించారు.
ఇప్పటికైనా కేంద్రం నుంచి రాష్ట్ర మంత్రులు వైదొలిగి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్దితో పాటు పడాలని చెప్పారు శ్రీధర్ రెడ్డి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టవద్దని చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు విషయంలోను టీడీపీ నేతలు ప్రత్యేక శ్రద్ద కనబరచాలని సూచించారు.