కౌంటర్ గేమ్ : కేసీఆర్ బాబును టార్గెట్ చేశారా! బాబు కౌంటర్ అందుకేనా?
విజయవాడ : ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలో.. మరొకటో తెలియదు గానీ ఇద్దరు చంద్రుల తీరు చూస్తోంటే మాత్రం పరస్పరం కౌంటర్ ఇచ్చుకున్నట్లే కనిపిస్తోంది. కొత్త జిల్లాల ప్రారంభం సందర్బంగా.. పక్క రాష్ట్రాలు సైతం తెలంగాణలో అభివృద్దిని చూసి అసూయపడేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని కేసీఆర్ వ్యాఖ్యలు చేయగా.. ఏపీలో అభివృద్దిని చూసి కొంతమంది అసూయపడుతున్నారంటూ బుధవారం నాడు చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో.. పరోక్షంగా ఈ ఇద్దరు ఒకరినొకరు టార్గెట్ చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా ప్రారంభం సందర్బంగా.. కొత్త జిల్లాల గురించి మాట్లాడుతున్న సందర్బంలో.. 'బ్రతికితే.. తెలంగాణకు పోయి బ్రతకాలె అని మన ఇరుగుపొరుగు రాష్ట్రాల ప్రజలు అనుకోవాలె, తెలంగాణ అభివృద్దిని చూసి పక్క రాష్ట్రాలు సైతం అసూయపడాలె' అంటూ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. ఇక నేటి ఉదయం వెలగపూడి సచివాలయాన్ని ప్రారంభించి.. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య తన ఛాంబర్ లోకి అడుగుపెట్టిన చంద్రబాబు.. 'రాష్ట్రాభివృద్దిని చూసి కొంతమంది అసూయపడుతున్నారని' కామెంట్ చేశారు.

దీంతో.. ఈ ఇద్దరు చంద్రుల కామెంట్స్ కు లింకు పెట్టి, ఇద్దరూ ఒకరినొకరు పరోక్షంగా టార్గెట్ చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఆ ఇద్దరు చంద్రుల మనసులో కూడా అదే ఉండుంటుందా..? లేక కాకతాళీయంగానే ఆ కామెంట్స్ చేసుంటారా?












Click it and Unblock the Notifications