స్టాఫ్ రగడ: కెసిఆర్, చంద్రబాబు భేటీ తప్పదా?
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదాన్ని పరిష్కరించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కానున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలిసి చర్చించక తప్పేట్లు లేదనిపిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మాట్లాడుకుంటేనే ఉద్యోగుల సమస్య పరిష్కారమవుతుందని విభజన కమిటీ కెసిఆర్తో చెప్పినట్లు సమాచారం.
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి బృందం శుక్రవారం భేటీ అయింది. ఉద్యోగుల విభజన, సచివాలయం, ఆస్తులు-అప్పులు తదితర అంశాలపై మహంతి పవర్పాయింట్ ప్రజంటేషన్ను ఇచ్చారు. లేకవ్యూ అతిథి గృహంలో జరిగిన ఈ భేటీలో గతంలో తెరాసలో చేరిన పలువురు రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు.
కెసిఆర్కు 45 పేజీల నివేదికను అందించారు. రెండున్నర గంటల పాటు చర్చలు జరిగాయి. జూన్ 2వ తేదీనాటికి ఉద్యోగుల విభజన జరుగుందని వారు కెసిఆర్తో చెప్పినట్లు సమాచారం. అయితే, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మాట్లాడుకుంటేనే సమస్య పరిష్కారమవుతుందని వారు చెప్పినట్లు తెలుస్తోంది. నీళ్ల పంపకాల విషయాన్ని బ్రిజేష్ కమిటీ చూసుకుంటుందని, దాని కాలపరిమితిని మరో రెండేళ్లు పొడిగించారని వారు చెప్పారు.
తెలంగాణకు 70 వేల కోట్ల రూపాయల అప్పు చెందుతుందని వారు చెప్పారు. హైదరాబాదులోని గ్రేహౌండ్స్ విభాగాన్ని కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని చెప్పారు. రెండు హబ్లను విశాఖ, వరంగల్ల్లో ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు.
ఇదిలావుంటే, రెండు రాష్ట్రాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను నామినేట్ చేయాలని గవర్నర్ నరసింహన్ మహంతిని ఆదేశించారు. ఈ నెల 1వ తేదీకి చంద్రబాబు, కెసిఆర్లతో చర్చించి గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను నియమించే అవకాశం ఉంది. కాగా, తెలంగాణలో పుట్టి పెరిగిన 16 మంది ఐఎఎస్ అధికారులను తెలంగాణకు బదిలీ చేయనున్నట్లు సమాచారం.