తారుమారు: టి టైంకి బాబు, కిరణ్ డుమ్మా, వ్యూహమా?
గత మూడు రోజులుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అస్వస్థతగా ఉన్నట్లు చెబుతున్నారు. అస్వస్థత కారణంగా కిరణ్ సభకు గైర్హాజరయ్యారని అంటున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా తెలంగాణ బిల్లుపై స్పీకర్ ప్రకటన చేసిన సమయంలో సభలో లేరు.
కిరణ్, చంద్రబాబులు సభకు గైర్హాజరు కావడంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ బిల్లును అడ్డుకుంటానని చెప్పిన కిరణ్ దొడ్డిదారిన తప్పించుకున్నారని, చంద్రబాబు కూడా సభకు రాలేదని ఆరోపిస్తున్నారు. వారు బిల్లుకు సహకరించినందు వల్లనే అసెంబ్లీకి వచ్చిందని ఆరోపిస్తున్నారు.
విభజన విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టతతో ఉంది. విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే తాము అడ్డుకుంటామని, వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించింది. దీంతో విభజనను ప్రత్యక్షంగా వ్యతిరేకిస్తున్న కిరణ్, పరోక్షంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబు బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో ఏం చేస్తారనే చర్చ సాగడంతో పాటు, ఈ అంశం అందరిలోను ఉత్కంఠను కలిగించింది.
కిరణ్ సభలో బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో రాజీనామా చేస్తారా? లేక ఇంకేలా అడ్డుకుంటారని అంశం సస్పెన్స్ అయింది. కానీ, తీరా ఆయన సభకే రాలేదు. తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో కిరణ్, చంద్రబాబులు వ్యూహాత్మకంగానే హాజరు కాలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిల్లుకు సహకరించినందునే వారు హాజరు కాలేదని జగన్ పార్టీ ఆరోపిస్తోంది.