మోడీ ఫోన్ చేశారా? ఇదీ జగన్ పరిస్థితి, విజయసాయితో ‘పీఎంఓ’కే కళంకం: బాబు తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరుపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి దగ్గరవుతూ టీడీపీపై బురద జల్లడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
Recommended Video

కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనంటూ డబుల్ గేమ్ ఆడుతున్నారని బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ వైపు బడ్జెట్ బాగుందని కేంద్రాన్ని పొగుడుతూనే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అనడం వైసీపీ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.

జగన్ పార్టీకి అదే పని
పదే పదే కేంద్రానికి ఫిర్యాదులు పంపుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకోవడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకుందని చంద్రబాబు మండిపడ్డారు. అంతేగాకుండా ప్రపంచ బ్యాంక్కు కూడా ఫిర్యాదులు పంపుతూ అక్కడ్నుంచి వచ్చే రుణాలను అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో వైయస్సార్ కాంగ్రెస్ తీరును ఎండగట్టాలని, అలాగే ఈ పరిస్థితులను అధిగమించి కేంద్రం నుంచి నిధులు వచ్చేలా టీడీపీ ఎంపీలు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు.

మోడీ ఫోన్ చేశారా?
కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు ఫోన్ చేశారని కొన్ని ఛానళ్లు అసత్యప్రచారం చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. మంగళవారం టీడీపీ సమన్వయకమిటీ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఏపీకి అన్యాయం జరిగిందని దేశంలో అన్ని పార్టీలు చెబుతుంటే.. వైసీపీ మాత్రం కనీసం స్పందించడం లేదని అన్నారు.

విజయసాయికి చురక.. సొంత పార్టీ ఎంపీలపై ఆగ్రహం
రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ ఒక్కడే మాట్లాడంలేదని, కేసులు నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాజ్యసభలో టీడీపీ ఎంపీలు వెల్లోకి వెళితే విజయసాయి ఎందుకు సీట్లోనే కూర్చున్నారని సీఎం ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజుకో డ్రామా ఆడుతోందని దుయ్యబట్టారు. పదవులు అనుభవించే కొంతమంది టీడీపీ నేతలు కీలక అంశాలపై స్పందించాలని, లేకుంటే ఊరుకోనంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయసాయి వెళ్తే.. పీఎంఓకే కళంకం
అంతేగాక, పీఎంవో కారిడార్లో తిరుగుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి దర్యాప్తు సంస్థలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పీఎంవో పరిసరాల్లోకి ఇలాంటి వారిని అనుమతించొద్దని అన్నారు. విజయసాయికి అపాయింట్మెంట్ ఇస్తే పీఎంవోకే కళంకమని సీఎం అన్నారు.

బీజేపీతో పొత్తు కోసం వెంపర్లు
కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును విజయసాయి కలిసిన విషయాన్ని.. టీడీపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీలు ఇవ్వడం కాదని... ఇచ్చిన హామీలను లోకసభలో ప్రకటిస్తేనే ఆందోళన విరమించాలని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. అంతవరకు పార్లమెంట్లో ఆందోళనలు కొనసాగించాలని నిర్దేశం చేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేద్దామని ఈ సందర్భంగా బాబు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications