తాత్కాలిక సచివాలయ సెగ: టిడిపి కొత్త ట్విస్ట్, స్వరంపెంచిన మాగంటి
హైదరాబాద్: ఏపీలో తాత్కాలిక సచివాలయం పైన విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అధికార టిడిపి నేతలు వివరణ ఇస్తున్నారు. రూ.వందలాది కోట్లు పెట్టి తాత్కాలిక సచివాలయం అవసరమా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
దీనికి టిడిపి నేతలు స్పందిస్తూ.. సచివాలయం తాత్కాలికమేనని, నిర్మాణం మాత్రం శాశ్వతం అని చెబుతున్నారు. బుధవారం ఉదయం టిడిపి నేత నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ... నిర్మాణం శాశ్వతమని చెప్పారు. సచివాలయం మాత్రమే తాత్కాలికం అన్నారు.
ఏపీ ప్రభుత్వం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేసింది. రూ.200 కోట్లతో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. దీంతో, రూ.200 కోట్లు వృథా చేస్తున్నారని, తాత్కాలిక సచివాలయం ఎందుకు అని కాంగ్రెస్, వైసిపిలి ప్రశ్నించాయి.
అయితే, ఇప్పుడు చేపడుతున్న నిర్మాణం.. తాత్కాలికం కాదని, కేవలం అందులో ఉండే సచివాలయమే తాత్కాలికమని టిడిపి నేతలు అంటున్నారు. పూర్తిస్థాయి సచివాలయం తయారయ్యాక ఇప్పుడు నిర్మితమైన భవనాన్ని మరో దానికి ఉపయోగిస్తామని చెప్పారు.
పార్టీని నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వాలి: మాగంటి బాబు
నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ఎంపీ మాగంటి బాబు ప్రశ్నించారు. బుధవారం టిడిపి సర్వసభ్య సమావేశంలో మాగంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీని నమ్ముకున్న వారికే పదవులు ఇవ్వాలన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని పక్కన పెట్టాలన్నారు. కాగా, ఈ సమావేశానికి పదిమంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.