ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ .. బీసీల కోసం ఆ పని చెయ్యాలన్న టీడీపీ అధినేత
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ లేఖలో చంద్రబాబు బీసీ జన గణన చేపట్టాలని ప్రధానిని కోరారు. సరైన సమాచారం అందుబాటులో లేక బీసీలకు అన్యాయం జరుగుతుందని, వారు వెనుకబాటుతనానికి గురవుతున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసినా బీసీలు ఇంకా వెనుకబడి ఉన్నారని లేఖలో స్పష్టం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.
బీసీ జన గణన చేపట్టాలని ప్రధానిని కోరిన చంద్రబాబు
బీసీ జనగణన జరిగితేనే సంక్షేమ ఫలాలు అందుతాయని చంద్రబాబు లేఖ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీసీ జన గణనపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న కులాల వారీగా ఉన్న వివరాలు 90 ఏళ్ల నాటివని పేర్కొన్న చంద్రబాబు అనేక కీలకమైన అంశాలను తన లేఖ ద్వారా ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లారు.భారతదేశ జనాభాలో వెనుకబడిన తరగతులు ఎక్కువశాతం ఉన్నారని కానీ జనాభాలో వారి నిష్పత్తికి తగినట్టుగా ప్రయోజనాలు అందక బీసీలు వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

జనాభా లెక్కలు సరిగ్గా లేకపోవడం వల్ల బీసీల సంక్షేమ పథకాల అమలు సరిగా లేదు
నిర్లక్ష్యానికి గురి కాబడిన సమూహంగా బీసీలు మిగిలిపోతున్నారని చంద్రబాబు లేఖలో స్పష్టం చేశారు. భారతదేశంలో కుల వివక్ష ఇప్పటికీ ఉందని ఇది కఠినమైన వాస్తవం అని పేర్కొన్నారు. కుల జనాభా గణన అనేది ఇప్పటికీ ఉన్న సామాజిక విభజనలను మరింత తీవ్రతరం చేస్తుందని, వివక్షను మరింత ప్రోత్సహిస్తుందని ఊహాగానాలు ఉన్నాయని, కానీ కుల జనాభా గణన చేయకపోవడం కూడా అలాగే అన్యాయం అంటూ చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు. జనాభా లెక్కలు సరిగ్గా లేకపోవడం వల్ల బీసీల సంక్షేమం వారి అభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకాల అమలు సరిగా జరగడం లేదంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
బీసీ కుల గణన కూడా జనాభా గణనలో చేర్చాలన్న చంద్రబాబు
కుల గణన చేయకపోవడం వల్ల బీసీలు వివక్ష కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, బీసీల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఇంకా బీసీలు పేదరికంలోనే కొనసాగుతున్నారని చంద్రబాబు లేఖలో స్పష్టం చేశారు. బీసీల సంక్షేమాన్ని, అభివృద్ధిని నిర్ధారించడం కోసం బీసీ కుల గణన కూడా జనాభా గణనలో చేర్చాలని చంద్రబాబు మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చట్టం 1993 సెక్షన్ 11 2018లో రద్దు చేయబడినప్పటికీ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పిందని పేర్కొన్న చంద్రబాబు ప్రతి పదేళ్ల గడువు ముగిసిన తర్వాత బిసి జాబితాలను సవరించాలని, వెనుకబడిన తరగతుల జాబితాలో కొత్త తరగతులను చేర్చే విధంగా సవరణ చేయాలని పేర్కొందని చంద్రబాబు స్పష్టం చేశారు.
బీసీలను సామాజికంగా, ఆర్థికంగా అర్థం చేసుకోవడానికి జనగణన
బీసీ జనాభా జాబితాలను కాలక్రమంలో సవరించాలని అందరూ అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు సమ సమాజం వైపు అడుగులు వేస్తున్నామని నిర్ధారించుకోవడానికి బీసీలను సామాజికంగా, ఆర్థికంగా అర్థం చేసుకోవడానికి వారికి సమాన అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేయాలని, దానికోసం బీసీ జన గణన ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. మరి చంద్రబాబు రాసిన లేఖపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications