ఏపీ కేబినెట్లోకి నాగబాబు, పల్లా ఇన్-వారిద్దరూ అవుట్-ముహుర్తం ఫిక్స్..?
ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్దీకరణకు సీఎం చంద్రబాబు సిద్దమవుతున్నారు. ఇప్పటికే ఆ మేరకు సంకేతాలు కూడా ఇచ్చేశారు. త్వరలోనే జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని అధికారికంగా చంద్రబాబు ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. అయితే నాగబాబుతో పాటు మరో సీనియర్ నేతకు కూడా కేబినెట్ బెర్త్ దగ్గబోతోంది. ఇందుకోసం ఇప్పటికే కేబినెట్ లో ఉన్న ఇద్దరికి ఉద్వాసన తప్పడం లేదు.
గత ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు ఏర్పాటు తర్వాత చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న కేబినెట్ లో పలు సంచలనాలు కనిపించాయి. ముఖ్యంగా సీనియర్లను పక్కనబెట్టి పలువురు జూనియర్లకు, ఇంకా చెప్పాలంటే తొలిసారి గెలిచిన వారికి సైతం మంత్రుల బెర్తులు ఇచ్చేశారు. దీనిపై సీనియర్లలో అసంతృప్తి వ్యక్తమవుతున్నా చంద్రబాబు మాత్రం మార్పుకే ఓటేశారు. అయితే ఈ ఆరునెలల్లో మంత్రులు పనితీరు మెరుగుపర్చుకోవాలని, శాఖలపై పట్టు పెంచుకోవాలని చంద్రబాబు పదే పదే కోరుతున్నా కొందరిలో మాత్రం మార్పు కనిపించడం లేదు.

మరోవైపు జనసేనకు ఇచ్చిన మాట ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్ లోకి తీసుకోవాల్సి వస్తోంది. అంటే మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ తప్పదని తేలిపోయింది. దీంతో పనిలో పనిగా మరో రెండు, మూడు మార్పులు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజా అంచనా ప్రకారం జనవరి 8న చంద్రబాబు కేబినెట్ పునర్ వ్యవస్దీకరణ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
ఏపీ కేబినెట్లో ప్రస్తుతం ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీ ఉంది. దీన్ని నాగబాబుకు ఇచ్చేందుకు చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. అదే సమయంలో కేబినెట్లో ఉన్న మంత్రుల్లో అంచనాలను అందుకోని ఓ ఇద్దరిపై వేటుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. వారిలో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ యువ మంత్రులే. ఇప్పటికే వీరిద్దరికీ పలుమార్లు హెచ్చరికలు వెళ్లినా మార్పు కనిపించడం లేదని సమాచారం. అందుకే వేటు వేయొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications