కింకర్తవ్యం: జగన్ను డైలమాలో పడేసిన బాబు
హైదరాబాద్: తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని డైలమాలో పడేశారు. ఫోన్ చేసి మరీ జగన్ను తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు ఆహ్వానించారు. జగన్ అభినందనలు తెలిపారు.
చంద్రబాబు ఆహ్వానం నేపథ్యంలో జగన్ ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. జగన్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తారా, లేదా అనేది సర్వత ఆసక్తికరమైన విషయంగానే ఉంది. చంద్రబాబు శుక్రవారం ఉదయం పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ జగన్ లైన్లోకి రాలేదు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా చెప్పారు. చివరకు జగన్ లైన్లోకి వచ్చి అభినందనలు తెలిపారు. చంద్రబాబు ఆహ్వానాన్ని అందుకున్నారు.

జగన్, చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థుల మాదిరిగా కాకుండా వ్యక్తిగత ప్రత్యర్థులుగా పోరాటం చేస్తూ వచ్చారు. విమర్శానాస్త్రాలు సంధించుకున్నారు. పరస్పరం తీవ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నారు. వీరిద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారా అనేంతగా దుయ్యబట్టుకున్నారు. జగన్ను ఆహ్వానించడంలో చంద్రబాబు విశేషమైన రాజకీయ పరిణితిని ప్రదర్శించారనే మాట వినిపిస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కె. చంద్రశేఖర రావు చంద్రబాబును వ్యక్తిగతంగా ఆహ్వానించలేదు. దాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. కెసిఆర్పై వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. అదే సమయంలో తన ప్రమాణ స్వీకారానికి కెసిఆర్ను కూడా ఆహ్వానించారు. కెసిఆర్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తారా అనేది సందేహమే. అయితే, తన ప్రతినిధినైనా పంపుతారా అనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications