కేంద్రంలో చక్రంపై బాబు దృష్టి: టి నుండి ఎంపీగా ఢిల్లీకి?
రాష్ట్రం విడిపోతే కేంద్రంలో చక్రం తిప్పాలని బాబు ఉవ్వీళ్లూరుతున్నారట. ఇందుకోసం సీమాంధ్రలో ఎమ్మెల్యేగా, తెలంగాణ నుండి ఎంపీగా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారట. బాబు చిత్తూరు జిల్లా నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
ఇదే విషయమై తెలంగాణ ప్రాంత తెలుగు తమ్ముళ్లు బాబును అడిగితే ఆయన అవునని గానీ, కొట్టిపారేయడం గానీ చేయలేదట. దీంతో బాబు మల్కాజిగిరి నుండి ఎంపీగా పోటీ చేయవచ్చునని ప్రచారం మరింత జోరందుకుంది.
ఎన్నికల అనంతరం అవసరాన్ని బట్టి, తన ఇష్టాన్ని బట్టి బాబు కొనసాగే అవకాశముందంటున్నారు. సీమాంధ్రలో టిడిపి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా లేదంటే మల్కాజిగిరి నుండి గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పేందుకు ఢిల్లీకి వెళ్తారని అంటున్నారు. మల్కాజిగిరి నుండి పోటీ చేసేందుకు పార్టీలో పోటీ ఉన్నప్పటికీ బాబు పోటీ చేస్తానంటే అందరు తప్పుకునే అవకాశముంది. మరోవైపు బాబు తనయుడు నారా లోకేష్ ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలోని ఓ నియోజవకర్గం నుండి పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.