లాంగ్ లీవ్ లేకుంటే వీఆర్ఎస్: ఉద్యోగుల తరలింపుపై చంద్రబాబుకు కొత్త తలనొప్పి
అమరావతి: జూన్ 27 నాటికి హైదరాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో అత్యధికమంది నవ్యాంధ్ర నూతన రాజధాని వెలగపూడి ప్రాంతంలోని తాత్కాలిక సచివాలయానికి తరలించాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి.
నవ్యాంధ్ర తాత్కాలిక రాజధానిగా సేవలందిస్తోన్న విజయవాడ, గుంటూరు సమీప ప్రాంతాల్లో ఇంటి అద్దెలు, మౌలిక వసతుల కొరతతో పాటు పిల్లల భవిష్యత్ సాకుగా చూపుతూ వచ్చిన ఉద్యోగులకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన నేపథ్యంలో వెళ్లక తప్పని పరిస్థితుల్లో తప్పించుకునేందుకు కొత్త మార్గాలు వెతుకుతున్నారు.
జూన్ 27 లోపు అన్నీ హెచవోడీలు హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి తరలివెళ్లాలని ప్రభుత్వం ఆ సర్క్యులర్లో పేర్కొంది. 9, 10 షెడ్యూళ్లలో ఉన్న సంస్థలను మినహాయించి... మిగిలిన ప్రభుత్వ సంస్థలన్నీ కొత్త రాజధానికి వెళ్లాలని స్పష్టం చేశారు. తమ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లో ఏర్పాటు చేసుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు.

భవన వసతి కోసం ఆయా విభాగాల అధిపతులు గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతే... ప్రైవేట్ భవనాలను మూడేళ్లకు లీజుకు తీసుకోవాలన్నారు. అద్దె భవనాలకు సంబంధించిన సమాచారం కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల వద్ద సమాచారం ఉందని సీఎస్ సర్క్యులర్లో పేర్కొన్నారు.
విజయవాడ, గుంటూరుకు వెళ్లి ప్రభుత్వ కార్యాలయాలను స్వయంగా వెతుక్కోవాలని ప్రభుత్వం నుంచి అన్ని విభాగాలకు చెందిన హెచవోడీలు సర్క్యులర్ వెళ్లగా, ఉద్యోగుల్లో అనేకులు లాంగ్ లీవ్ తీసుకుని ఈ 'వెతుకులాట' సమస్య నుంచి బయటపడాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మరికొంతమంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉండిపోవాలని కూడా భావిస్తున్నారని ఉద్యోగ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నవ్యాంధ్ర నూతన రాజధానికి ఉద్యోగుల తరలింపునకు సరిగ్గా నెల రోజుల గడువు మాత్రమే ఉండగా, ఇప్పటివరకూ ఒక్క కార్యాలయానికి కూడా సరైన భవంతి వసతి కుదరలేదు.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందుగా అనుకున్న విధంగా ఉద్యోగుల తరలింపు సక్రమంగా పూర్తవుతుందా అన్నది వేచి చూడాలి. మరోవైపు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని గుంటూరులోనే ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు.
గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని పాత మార్కెట్ యార్డు ఆవరణలో రైతుల శిక్షణ కోసం నిర్మించిన భవనాన్ని మార్కెటింగ్ శాఖకు కేటాయించారు. ఆధునీకరించిన కార్యాలయాన్ని బుధవారం కమిషనర్ పరిశీలించారు. జూన్ 25లోపు ఉద్యోగులందరు గుంటూరు కార్యాలయానికి రావాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications