విభజన: బిజెపికి చంద్రబాబు ఇక దూరమేనా?
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సహకరించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపికి దూరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి మాత్రమే బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు సాగించినట్లు ప్రచారం కూడా ఉంది. తెలంగాణ బిల్లుకు బిజెపి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీపై తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు మండిపడుతున్నారు.
గత కొన్ని రోజులుగా బిజెపి అగ్రనేతలు నరేంద్ర మోడీ, అద్వానీ చేస్తున్న ప్రకటనలతో రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బిజెపి నిలబడుతుందనే అభిప్రాయం సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉంటూ వచ్చింది. చంద్రబాబు కూడా అనేకసార్లు బిజెపి నేతలను తరుచుగా కలుస్తూ వచ్చారు. కాంగ్రెస్ ఏకపక్షంగా పోకుండా నివారించాలని, ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వారినుంచి ఆయనకు సానుకూల సంకేతాలు ఉన్నాయన్న ప్రచారం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరిగింది.
తాము తెలంగాణ బిల్లుకు సహకరించలేమని అద్వానీ ఇటీవల తనను కలిసి తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులతో అన్నారు. దీంతో బిల్లుకు బిజెపి మద్దతు ఇవ్వబోదని సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు భావిస్తూ వచ్చారు. లోక్సభలో తృణమూల్ కాంగ్రెస్, జెడియు వాకౌట్ చేసి బయటకు వచ్చాయి. బిజెపి కనీస ప్రతిఘటన కూడా ప్రదర్శించలేదని, వాకౌట్ చేసినా బాగుండేదని తెలుగుదేశం సీమాంధ్ర నేతలు అంటున్నారు. బిజెపి వ్యవహారంపై చంద్రబాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతామని సీమాంధ్ర నేతలు అంటున్నారు.
అయితే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతల వాదన భిన్నంగా ఉంది. బిల్లు ఆమోదం విషయంలో కాంగ్రెస్కు బిజెపి మద్దతు ఇవ్వడం వల్లే ఏ అడ్డంకులూ లేకుండా సాఫీగా జరిగిందన్న అభిప్రాయం ఉందని, అందువల్ల ఆ పార్టీతో పొత్తు ఉంటే తమకు లాభమేనని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నికల్లో ఓ పక్కన నిలబడితే బిజెపి సాయంతో తాము మరో పక్కన నిలవడవచ్చునని, అది తమకు కలిసి వస్తుందని తెలంగాణ ప్రాంతం తెలుగుదేశం నాయకులు వాదిస్తున్నారు.
పొత్తు లేకపోతే తెలంగాణకు చెందిన ఐదుగురు శాసనసభ్యులు బిజెపిలో చేరినా ఆశ్చర్యం లేదనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకుని, సీమాంధ్రలో దూరంగా ఉండే వైఖరిని చంద్రబాబు అనుసరిస్తారా, అది సాధ్యమేనా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది.