రాజధాని తరలింపు యోచనకు చంద్రబాబు స్వస్తి
హైదరాబాద్: విజయవాడలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు యోచనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విరమించుకున్నట్లు తెలుస్తోంద. తాత్కాలిక రాజధాని నిర్మాణం కూడా ఆఘమేఘాల మీద సాధ్యం కాదని, కనీసం ఏడాది పడుతుందని, అందువల్ల దాన్ని విరమించుకుని శాశ్వత రాజధాని నిర్మాణంపైనే దృష్టి పెడితే మంచిదని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ పాలన సీమాంధ్ర నుంచే సాగాలని, ఈ ఏడాది జూన్ 8లోగా తాత్కాలిక రాజధానిని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ పెద్దలు పునరాలోచనలో పడినట్లు వార్తలు వచ్చాయి. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి కనీసం రూ.300 కోట్లు వ్యయం అవుతుందని, ఇంత ఖర్చు చేసినా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావని అర్థం కావడంతో అదంతా వృధా ప్రయాస అని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు

రహదారులు, సిబ్బందికి ఆవాసాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తగిన స్థాయిలో లేవని, వసతులు కల్పిస్తేనే కొత్త రాజధానికి వస్తామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారని అంటున్నారు. నామమాత్రంగా ఏప్రిల్, మే నెల నాటికి తాత్కాలిక రాజధాని పూర్తయినా, అప్పటికే విద్యాసంస్థల్లో పిల్లలను చేర్చేందుకు సమయం మించి పోతుందని, ఈ కారణం చూపుతూ మరో ఏడాది తర్వాతే తాత్కాలిక రాజధాని నగరానికి తరలేందుకు ఉద్యోగులు సుముఖత చూపుతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
శాశ్వత రాజధానిలో భాగంగా అసెంబ్లీ, సచివాలయం వంటి భవనాల నిర్మాణానికి దాదాపు రూ.800 కోట్ల వరకూ వ్యయమవుతుందని భావిస్తున్నారు. రెండేళ్లలో వాటి నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశముందని, అలాంటప్పడు తాత్కాలిక రాజధాని నిర్మాణం అవసరం ఏముందని అనుకుంటున్నారు. తాత్కాలిక రాజధాని పేరిట ఉద్యోగులను ఇబ్బంది పెట్టటం, ఆర్థిక సంక్షోభం సమయంలో రూ.300 కోట్లకు పైగా వ్యయం చేయడం అనవసరమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
వాస్తవానికి తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఇన్క్యాప్ టెండర్లను పిలిచింది. ఓ సంస్థకు బాధ్యతలను కూడా అప్పగించింది. అయితే, తుది ఆమోదానికి మాత్రం ముందుకు రాలేదు. తాము చెప్పేంత వరకూ తాత్కాలిక రాజధాని డిజైన్ రూపకల్పనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications